తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు రాజకీయ ప్రయోజనాల కోసమే ఢిల్లీ యాత్ర చేపట్టారని ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి అన్నారు.
సాక్షి, తిరుపతి: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు రాజకీయ ప్రయోజనాల కోసమే ఢిల్లీ యాత్ర చేపట్టారని ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి అన్నారు. ఆయన తిరుపతిలో సోమవారం పశువుల కాపరి వేషంలో పశువులను కాస్తూ రాష్ట్ర విభజనకు నిరసన తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, రాష్ట్ర విభజనపై చర్చించడానికి ఆయన రాష్ట్రపతిని కలుసుకోలేదని, జగన్మోహన్రెడ్డి బెయిలును అడ్డుకునేందుకు సహాయాన్ని కోరుతూ వెళ్లారని ఆరోపించారు. ఈ విషయాన్ని ఆయన రాష్ట్రపతి అపాయింట్మెంట్ లేఖలో పేర్కొన్నారని తెలిపారు. వచ్చేఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి ఆ పార్టీ నేత రాజ్నాథ్సింగ్ను కలుసుకున్నారని, ఆ పార్టీతో లోపాయికారీ ఒప్పందాలు కుదుర్చుకున్నారన్నారు. తమ పార్టీకోసం వాడుకునేందుకు ఇంకా పలువురు నాయకులను కలుసుకున్నారని చెప్పారు.
కాంగ్రెస్పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ దూతలను కూడా రహస్యంగా కలుసుకుని తన కుతంత్రాలను చాటుకున్నారని తెలిపారు. రాష్ట్ర విభజనను అడ్డుకోవాలనే ఆలోచన సీమాంధ్ర కాంగ్రెస్ నేతల్లో లేదన్నారు. వారికి నిజం గా అటువంటి ఉద్దేశం ఉంటే పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సీమాంధ్ర నేతలు రాష్ట్రంలో తిరగలేక ఢిల్లీలోనే తచ్చాడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సా ర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వరప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.