పల్లె కంటకన్నీరు | Bhogapuram Greenfield Airport Construction | Sakshi
Sakshi News home page

పల్లె కంటకన్నీరు

Sep 3 2015 11:43 PM | Updated on Sep 3 2017 8:41 AM

భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు నిర్మాణంపై ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన తొమ్మిది గ్రామా ల ప్రజలు భగ్గుమంటున్నారు. విమానాశ్రయ నిర్మాణానికి

 విజయనగరం కంటోన్మెంట్: భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు నిర్మాణంపై ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన తొమ్మిది గ్రామా ల ప్రజలు భగ్గుమంటున్నారు. విమానాశ్రయ నిర్మాణానికి మండలంలోని 9 గ్రామాల్లో 5,311.88 ఎకరాలను భూ సేకరణ ద్వారా తీసుకునేందుకు  సర్కారు నిర్ణయించిన నేపథ్యంలో భూ సేకరణ చేపడితే విభిన్నంగా ఉద్యమించాలని భోగాపురం ప్రాంత వాసులు పలు నిర్ణయాలను తీసుకున్నారు.  గూడెపు వలస, కౌలువాడ, రావాడ, ముంజేరు, కొంగవాని వలన, కంచేరు, కంచేరుపాలెం, సవరవిల్లి, ఎ.రావివలస గ్రామాల్లో భూ సేకరణకు ప్రభుత్వం సిద్ధమైంది. గతంలో పలు ప్రకటనలు వెలువడినప్పుడు జిల్లాకేంద్రాన్ని కేంద్రీకృతం చేసుకుని పోరాటాలు చేశారు.  సర్వేకోసం వచ్చిన రైట్‌బృందాన్ని మూకుమ్మడిగా అడ్డుకున్నారు. బృందంలోని ఇద్దరు సభ్యులను తరిమికొట్టారు. మరో పక్క మండలం కేంద్రం, జిల్లా కేంద్రాల్లో నిర్వాసిత గ్రామాల ప్రజలు ఆందోళనలు చేపట్టారు.
 
 బాధిత గ్రామాల్లోనే దీక్షలు
 ఎక్కడైతే  భూములను సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించిందో ఆయా గ్రామాల్లో రోజుకో గ్రామం చొప్పున ఎంపిక చేసి ఆయా ప్రాంతాల్లో రిలే నిరాాహార దీక్షలు చేయాలని నిర్ణయించారు. యువత ఓ సారి, మహిళలు మరోసారి, రైతాంగమంతా ఇంకోసారి నిరసన దీక్షలు చేయాలని నిర్ణయించారు.
 ఈ సారి దీక్షలు, పోరాటం ఉద్ధృతంగా ఉంటుందని విమానాశ్రయ నిర్మాణ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో పలుమార్లు సమావేశాలు నిర్వహించిన సందర్భంగా కమిటీ సభ్యులు కొత్త ప్రణాళికలు రచించారు. ఇందులో భాగంగానే ఉద్యమానికి ఊతమిచ్చేందుకు రాష్ట్రస్థాయి నాయకులను తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక్కడి వారితో పాటు రాష్ర్ట స్థాయిలో ఉన్న నాయకులు కూడా పొల్గొంటే పోరాటానికి మరింత ఊతమిచ్చినట్టు అవుతుందని భావిస్తున్నారు.  అయితే  ప్రభుత్వం మాత్రం త్వరలో భూ సేకరణ చట్టంలో  కొత్త ఆర్డినెన్స్ వస్తుందని, దీని వల్ల ఆర్డినెన్స్ అమలయ్యే వరకూ విమానాశ్రయ నిర్మాణానికి ఒక్క అడుగూ ముందుకు వేయలేమని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
 
 కృతనిశ్చయంతో ప్రభుత్వం
  ఎట్టి పరిస్థితుల్లోనూ విమానాశ్రయ నిర్మాణానికి అవసరమైన భూములను తీసుకునేందుకు  కృత నిశ్చయంతో ప్రభుత్వ యంత్రాంగం పథకం రచిస్తోంది. ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసిన గ్రామాల్లో భూముల క్రయ విక్రయాలను నిషేధించింది. ఆర్‌ఆర్ ప్యాకేజీని అమలు చేసేందుకు జాయింట్ కలెక్టర్ బి రామారావు, బొబ్బిలి ఎస్‌డీసీ అనితలను నియమించింది.
 
 భూములను ఇప్పటికే గుర్తించినందున భవిష్యత్తులో ఎటువంటి ఆటంకాలూ లేకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటోంది. పోరాటాలు చేసి న వారిని తగ్గించేందుకు ఎన్ని అవకాశాలుంటే అన్నింటినీ వినియోగించా లని భావిస్తోంది. అవసరమైతే సెక్షన్-30 ఎలాగూ ఉందనే భావన ప్రభుత్వ వర్గాల్లో కనిపిస్తోంది. ఇక భవిష్యత్తులో ప్రభుత్వ యంత్రాంగం నిర్వాసితుల మధ్య పెద్దస్థాయిలో పోరు జరిగే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement