కొండంత భరోసా | Barbers Welcomes YS Jagan Desition | Sakshi
Sakshi News home page

కొండంత భరోసా

May 11 2018 6:16 AM | Updated on May 25 2018 7:10 PM

Barbers Welcomes YS Jagan Desition - Sakshi

అమరావతి : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తమపై కురిపించిన వరాలకు నాయీ బ్రాహ్మణులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా కృష్ణాజిల్లా కల్వపూడి అగ్రహారం సమీపంలో ఇటీవల జరిగిన రాష్ట్ర నాయీ బ్రహ్మణుల ఆత్మీయ సమ్మేళనంలో వైఎస్‌ జగన్‌ ఉచిత విద్యుత్, ఆర్థిక సాయం హామీలు ఇచ్చారు. సెలూన్ల నిర్వహణకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్‌ లేదా ఏడాదికి రూ.10 వేలు సాయం చేస్తానని, ఆలయాల్లో పనిచేస్తున్న నాయీబ్రహ్మణులకు పాలక మండళ్లల్లో చోటు కల్పిస్తానని హామీ ఇచ్చారు. చట్టసభల్లోనూ కూడా అవకాశం కల్పిస్తామని ప్రకటించారు. ఈ హామీలు తమకు కొండంత భరోసా ఇచ్చాయని నాయీబ్రాహ్మణులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు.  

ఆనందంగా ఉంది
క్షౌరవృత్తిదారుల సమస్యలను పరిష్కరించే దిశగా వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌హన్‌రెడ్డి ఇచ్చిన హామీలు అభినందనీయం. ఆయన అధికారంలోకి రాగానే క్షౌర శాలలకు 250 యూనిట్ల విద్యుత్‌ వరకు ఉచితంగా అందిస్తామని హామీ ఇవ్వడంతో ఆనందంగా ఉంది. సెలూన్లకు 500 యూనిట్ల వరకు కమర్షియల్‌ కాకుండా, గృహాలతో సమానంగా చార్జీలు అమలు చేస్తే మా కులస్తులకు ఎంతో మేలు కలుగుతుంది.
– వై.కిషోర్‌బాబు,క్షౌరవృత్తిదారుల సంఘం జిల్లా  మాజీ కార్యదర్శి, రేపల్లె

విద్యుత్‌ భారం తగ్గుతుంది
ప్రస్తుతం సెలూన్లలో ఎలక్ట్రానిక్‌ వస్తువుల వాడకంతో విద్యుత్‌ వినియోగం పెరిగింది. కరెంటు బిల్లులు వేల రూపాయల్లో వస్తున్నాయి. దీంతో షాపుల అద్దెలు చెల్లించలేక పోతున్నాం. కరెంటు బిల్లు కెటగిరీ–2లో ఇవ్వడం వల్ల రెట్టింపుకట్టాల్సి వస్తోంది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్‌మోహన్‌ రెడ్డి మమ్ములను గుర్తించి 250 యూనిట్లకు ఉచిత విద్యుత్‌ ఇస్తామనడం సంతోషంగా ఉంది. విద్యుత్‌ భారం తగ్గుతుంది.
–ముక్యాని రామయ్య, సెలూన్‌ నిర్వాహకుడు, వినుకొండ

సాహసోపేత నిర్ణయం
మాకు ప్రస్తుతం ఉన్న నాయీ బ్రాహ్మణ ఫెడరేషన్‌ స్థానంలో కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తానని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం మా కులస్తులు ఎంతో మంది షాపులను ఏర్పాటు చేసుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి రుణాలను అందిస్తే స్వంతగా షాపులను ఏర్పాటు చేసుకోని కులవృత్తితో హాయిగా జీవిస్తారు.
– కంభంపాటి శ్రీనివాసరావు,నాయీబ్రాహ్మణుడు, సత్తెనపల్లి

ఇన్నాళ్లకు గుర్తింపు
ఇన్నాళ్లకు నాయీ బ్రాహ్మణులకు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్‌.జగన్‌ మోహన్‌రెడ్డి వల్ల గుర్తింపు వచ్చింది. ఇప్పటి వరకు నాయీ బ్రాహ్మణులను అన్నీ రాజకీయ పార్టీలు కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకున్నాయి. చట్ట సభల్లో స్థానం కల్పించటంతో పాటు సెలూన్ల నిర్వహణకు చేయూత ఇస్తానంటూ వైఎస్‌ జగన్‌ ప్రకటించడం హర్షణీయం. ఆ ప్రకటన అమలు కోసం ఎదురు చూస్తున్నాం.
– అట్లూరి ఆంజనేయులు, అధ్యక్షుడు, నాయీ బ్రాహ్మణ సంఘ కోటప్పకొండ అన్నదాన సత్రం

Advertisement
 
Advertisement
Advertisement