బాబు ప్రజల్ని అవమానించారు | Babu public humiliation | Sakshi
Sakshi News home page

బాబు ప్రజల్ని అవమానించారు

Sep 5 2014 2:26 AM | Updated on Sep 2 2017 12:52 PM

రాజధాని ప్రకటన తీరుతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆ పదవిని, ముఖ్యంగా ప్రజల్ని అవమానించేలా వ్యవహరించారని చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఒక ప్రకటనలో ఆరోపించారు.

తిరుపతి రూరల్: రాజధాని ప్రకటన తీరుతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆ పదవిని, ముఖ్యంగా ప్రజల్ని అవమానించేలా వ్యవహరించారని చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఒక ప్రకటనలో ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం వేసిన మేధావుల కమిటీ రిపోర్టును పరిగణనలోకి తీసుకోకుండా అత్యంత ప్రమాదకరంగా చంద్రబాబు వ్యవహరించారని దుయ్యబట్టారు. ఓ రాష్ట్రానికి రాజధానిపై ప్రకటన చేసేముందు కనీసం అసెంబ్లీలో చర్చ లేకుండా చేయడం ఆయన దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని విమర్శించారు.

చంద్రబాబు పూర్తిగా కార్పొరేటర్ల చేతుల్లోకి వెళ్లిపోయూరని ఆరోపించారు. ఎన్నికల్లో ఖర్చు కోసం కక్కుర్తిపడి నలుగురు వ్యక్తుల చేతుల్లో బాబు కీలుబొమ్మగా మారిపోవడం బాధాకరమన్నారు. పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు చెప్పినట్టు బాబు గంగిరెద్దులా తలూపుతూ పరిపాలన చేయడం సిగ్గుచేటన్నారు. కార్పొరేట్ సెక్టార్‌లో రాజధాని నిర్మాణం మంచిది కాదని స్వయంగా కేంద్ర కమిటీ తేల్చినా ఏక పక్షంగా, అన్యాయంగా, అప్రస్వామికంగా ప్రకటన చేయడం అన్యాయమన్నారు.

ఇది ప్రజల్ని ముమ్మాటికీ మోసం చేసేవిధంగా ఉందన్నారు. ఇది తెలుగు ప్రజలకు దుర్దినంగా ఆయన అభివర్ణించారు. ఎక్కడ రాజధానిని నిర్ణయించాలి, ఎప్పుడు అసెంబ్లీ సమావేశాలు పెట్టాలి, ఎప్పుడు మంత్రి వర్గం  ఏర్పాటు చేయాలనేది ఇప్పుడు బాబు చేతుల్లో లేదని ఆరోపించారు.

కనీసం సీఎం సీట్లో కుర్చోవాలన్నా పార్టీని శాసిస్తున్న ఆ నలుగురు వ్యక్తులు చెప్పాల్సిందేనని, లేకుంటే ఆయన అటువైపు కూడా చడలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారని మండిపడ్డారు. రాజధాని నిర్ణయం చరిత్రలో చంద్రబాబు చేసిన అతిపెద్ద తప్పుగా ఆయన అభివర్ణించారు. కేబినెట్ సమావేశాల్లోకి నేరుగా రియల్‌వ్యాపారులు వస్తూ ప్రభుత్వాన్ని శాసిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement