హై పవర్‌ కమిటీ నివేదికకు కేబినెట్‌ ఆమోదం

Assembly Special sessions On AP Capital: Cabinet approves High Power Committee Report - Sakshi

అమరావతి: హై పవర్‌ కమిటీ నివేదికకు ఆంధ్రప్రదేశ్‌ మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సోమవారం ఉదయం సమావేశమైన మంత్రిమండలి భేటీ పలు కీలక అంశాలపై చర్చించింది. రాష్ట్రంలో పరిపాలనా వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి సంబంధించి శాసనసభలో ప్రతిపాదించే బిల్లుపై చర్చించి ఆమోదముద్ర వేసింది. అలాగే రాజధాని రైతులకు చెల్లిస్తున్న పరిహారానికి సంబంధించి కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది.

రైతులకు ఇచ్చే పరిహారాన్ని పెంచుతూ మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. రైతులకు చెల్లిస్తున్న పరిహారం రూ. 2500 నుంచి రూ. 5000కు పెంచడాన్ని మంత్రిమండలి ఆమోదించింది. అలాగే, పరిహారం చెల్లింపు 10 ఏళ్ల నుంచి 15 ఏళ్ల వరకూ ఇవ్వాలని నిర్ణయించింది. అలాగే రాష్ట్రంలో 11 వేలకు పైగా రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుకు మంత్రివర్గం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఇక సీఆర్‌డీఏను అమరావతి మెట్రో పాలిటన్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీగా మార్చుతూ నిర్ణయం తీసుకుంది.
ఏపీ కేబినెట్‌ నిర్ణయాలు

  • రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుకు ఆమోదం
  • రాజధాని రైతులకు మెరుగైన ప్యాకేజీ
  • రూ.2500 నుంచి 5వేలకు పరిహారం పెంపు
  • భూములు ఇచ్చిన రైతులకు కౌలు 15 ఏళ‍్లకు పెంపు
  • శాసన రాజధానిగా అమరావతి
  • పరిపాలన రాజధానిగా విశాఖపట్నం
  • న్యాయ రాజధానిగా కర్నూలు

స్పీకర్‌ అధ్యక్షతన బీఏసీ సమావేశం
మంత్రివర్గం భేటీ అనంతరం స్పీకర్‌ అధ్యక్షతన జరిగిన శాసనసభా వ్యవహారాల సలహా కమిటీ (బీఏసీ) సమావేశానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి, ఇక టీడీపీ తరఫున ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు హాజరయ్యారు. మూడు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయం జరిగింది. కాగా  సీఆర్‌డీఏ రద్దు, వికేంద్రీకరణ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది.

చదవండి:

సీఎం జగన్ అధ్యక్షతన మంత్రివర్గం భేటీ

అమరావతికి అన్నీ ప్రతికూలతలే

మూడు కమిటీలూ వికేంద్రీకరణకే ఓటు

అమరావతిలో అలజడికి కుట్రలు..

మూడు ప్రాంతాల సమగ్రాభివృద్ధే ధ్యేయం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top