వైఎస్‌ఆర్‌సీపీతోనే ముస్లింల అభివృద్ధి | Sakshi
Sakshi News home page

వైఎస్‌ఆర్‌సీపీతోనే ముస్లింల అభివృద్ధి

Published Mon, Aug 6 2018 8:49 AM

AP State Developed With YS Jagan Mohan Reddy  Avinash Reddy - Sakshi

మలాపురం అర్బన్‌ : ముస్లింల అభివృద్ధి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితోనే సాధ్యమని ఆ పార్టీ మాజీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి తెలిపారు. ముస్లిం యూత్‌ నాయకుడు కరీముల్లా ఆధ్వర్యంలో 40 కుటుంబాలు ఆదివారం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వారు ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డి సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి మాజీ ఎంపీ, ఎమ్మెల్యే పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైఎస్‌ అవినాష్‌రెడ్డి మాట్లాడారు. రాష్ట్ర మంత్రివర్గంలో ఏ ఒక్క ముస్లింకు మంత్రి పదవి లేదన్నారు. దీన్నిబట్టి చూస్తే టీడీపీకి ముస్లింల పట్ల ఎంత ప్రేమ ఉందో అర్థం అవుతుందన్నారు.

వచ్చే ఎన్నికల నాటికి కమలాపురం నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేసి, అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యేను గెలిపించాలని కోరారు. ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ ముస్లింలు ఎప్పుడూ వైఎస్‌ఆర్‌సీపీ పక్షమేనని తెలిపారు. ముస్లిల సమస్యలను పరిష్కరించడం కోసం తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కడప ఎమ్మెల్యే బి.అంజద్‌ బాషా మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్, మంత్రి వర్గంలో ప్రాధాన్యత కల్పించడం జరిగిందన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలు పరిచి ఉన్నత విద్య చదువుకోనేలా అవకాశం కల్పించారని పేర్కొన్నారు.

కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు సురేష్‌బాబు మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో ముస్లింలకు ఎలాంటి న్యాయం జరగలేదన్నారు.  కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు ఉత్తమారెడ్డి, సీఎస్‌ నారాయణరెడ్డి, సంబటూరు ప్రసాద్‌రెడ్డి, సుమీత్రా రాజశేఖర్‌రెడ్డి, ఎన్‌సీ పుల్లారెడ్డి, మారుజొళ్ళ శ్రీనివాసరెడ్డి, పి.వి.క్రిష్ణారెడ్డి, అల్లె రాజారెడ్డి, మునిరెడ్డి, నారదా గఫార్‌ బ్రదర్స్, ఖదర్‌హుస్సేన్, మస్తాన్, రామలక్ష్మణ్‌రెడ్డి, చెన్నకేశవరెడ్డి, సుబ్బిరెడ్డి, పైడేలా లక్ష్మినారాయణరెడ్డి, రమణారెడ్డి, హరినాథ్‌రెడ్డి, రాష్ట్ర ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శి టి.రజనీకాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement