
విభజన చట్టం సవరణకు పెద్దల సభ ఓకే
ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ సవరణ బిల్లు-2015కు పెద్దల సభ పచ్చజెండా ఊపింది. ఫలితంగా ఏపీ శాసనమండలి స్థానాలు 50 నుంచి 58కి పెరగనున్నాయి.
- 58కి పెరిగిన ఏపీ మండలి స్థానాలు
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ సవరణ బిల్లు-2015కు పెద్దల సభ పచ్చజెండా ఊపింది. ఫలితంగా ఏపీ శాసనమండలి స్థానాలు 50 నుంచి 58కి పెరగనున్నాయి. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా హామీలను అమలు చేయాలని కాంగ్రెస్, టీడీపీలకు చెందిన రాజ్యసభ ఎంపీలు డిమాండ్ చేశారు. ఈ బిల్లుపై శుక్రవారం జరిగిన చర్చలో తొలుత కాంగ్రెస్ ఎంపీ జేడీ శీలం మాట్లాడుతూ.. ‘ఉమ్మడి ఏపీలో ఉన్నవే 90.
తెలంగాణలో మండలి ఏర్పడాలంటే కనీసం 40 స్థానాలుండాలి. అందుకే 40 కేటాయించారు. మిగిలిన 50 ఏపీకి కేటాయించా రు. మూడో వంతు వరకు పెంచుకోవచ్చు కాబట్టి ఇప్పుడు 58కి పెంచుతున్నారు. దీన్ని తప్పుబట్టడం సరికాదు’ అని అన్నారు. టీడీపీ ఎంపీ సీఎం రమేశ్ మాట్లాడుతూ అసెంబ్లీ సీట్లను కూడా 175 నుంచి 225కు పెంచాలని కోరారు. కాంగ్రెస్ సభ్యుడు కేవీపీ రాంచంద్రరావు మాట్లాడుతూఏపీకి పోర్టులు, విమానాశ్రయాలు, నిధులివ్వాలని చేతులు జోడించి కోరుతున్నామన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వడంతో పాటు పోలవరం ప్రాజెక్టును త్వరగా నిర్మించాలని కోరారు.
కాంగ్రెస్ ఎంపీ టి.సుబ్బిరామిరెడ్డి మాట్లాడుతూ.. ‘పోలవరం అంచనా వ్యయం రూ.16 వేల కోట్లు ఉంటే.. వీళ్లు రూ.100 కోట్లు ఇచ్చారు. కనీసం ఈ ఆర్థిక సంవత్సరం రూ.2 వేల కోట్లయినా ఇవ్వాలి’ అని కోరారు. కాంగ్రెస్ ఎంపీ వి.హనుమంతరావు మాట్లాడుతూ.. ‘తెలంగాణలో 4 వేల మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టు సహా ఇతర హామీలను నెరవేర్చాలి. ప్రాణహితకు జాతీయ హోదా ప్రకటించాలి. తెలంగాణలో వెనకబడిన జిల్లాలకు ప్యాకేజీ ఇవ్వాలి’ అని డిమాండ్ చేశారు.
ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ మాట్లాడుతూ ‘ముంపు బాధిత మండలాల ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి. తెలంగాణ, ఏపీ అసెంబ్లీల్లో స్థానాల సంఖ్య పెంచాలి’ అని కోరారు. కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి మాట్లాడుతూ.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎంలూ కూర్చొని మాట్లాడుకోవాలి. సమస్యలు పరిష్కరించుకోవాలని అన్నారు.