breaking news
division of the law
-
విభజన చట్టం సవరణకు పెద్దల సభ ఓకే
58కి పెరిగిన ఏపీ మండలి స్థానాలు సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ సవరణ బిల్లు-2015కు పెద్దల సభ పచ్చజెండా ఊపింది. ఫలితంగా ఏపీ శాసనమండలి స్థానాలు 50 నుంచి 58కి పెరగనున్నాయి. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా హామీలను అమలు చేయాలని కాంగ్రెస్, టీడీపీలకు చెందిన రాజ్యసభ ఎంపీలు డిమాండ్ చేశారు. ఈ బిల్లుపై శుక్రవారం జరిగిన చర్చలో తొలుత కాంగ్రెస్ ఎంపీ జేడీ శీలం మాట్లాడుతూ.. ‘ఉమ్మడి ఏపీలో ఉన్నవే 90. తెలంగాణలో మండలి ఏర్పడాలంటే కనీసం 40 స్థానాలుండాలి. అందుకే 40 కేటాయించారు. మిగిలిన 50 ఏపీకి కేటాయించా రు. మూడో వంతు వరకు పెంచుకోవచ్చు కాబట్టి ఇప్పుడు 58కి పెంచుతున్నారు. దీన్ని తప్పుబట్టడం సరికాదు’ అని అన్నారు. టీడీపీ ఎంపీ సీఎం రమేశ్ మాట్లాడుతూ అసెంబ్లీ సీట్లను కూడా 175 నుంచి 225కు పెంచాలని కోరారు. కాంగ్రెస్ సభ్యుడు కేవీపీ రాంచంద్రరావు మాట్లాడుతూఏపీకి పోర్టులు, విమానాశ్రయాలు, నిధులివ్వాలని చేతులు జోడించి కోరుతున్నామన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వడంతో పాటు పోలవరం ప్రాజెక్టును త్వరగా నిర్మించాలని కోరారు. కాంగ్రెస్ ఎంపీ టి.సుబ్బిరామిరెడ్డి మాట్లాడుతూ.. ‘పోలవరం అంచనా వ్యయం రూ.16 వేల కోట్లు ఉంటే.. వీళ్లు రూ.100 కోట్లు ఇచ్చారు. కనీసం ఈ ఆర్థిక సంవత్సరం రూ.2 వేల కోట్లయినా ఇవ్వాలి’ అని కోరారు. కాంగ్రెస్ ఎంపీ వి.హనుమంతరావు మాట్లాడుతూ.. ‘తెలంగాణలో 4 వేల మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టు సహా ఇతర హామీలను నెరవేర్చాలి. ప్రాణహితకు జాతీయ హోదా ప్రకటించాలి. తెలంగాణలో వెనకబడిన జిల్లాలకు ప్యాకేజీ ఇవ్వాలి’ అని డిమాండ్ చేశారు. ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ మాట్లాడుతూ ‘ముంపు బాధిత మండలాల ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి. తెలంగాణ, ఏపీ అసెంబ్లీల్లో స్థానాల సంఖ్య పెంచాలి’ అని కోరారు. కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి మాట్లాడుతూ.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎంలూ కూర్చొని మాట్లాడుకోవాలి. సమస్యలు పరిష్కరించుకోవాలని అన్నారు. -
కేంద్రంపై ఎందుకీ మౌనం?
రాష్ట్రాన్ని అథోగతిలోకి నెట్టడంలో తొలి ముద్దాయి కాంగ్రెసే సీఎం చంద్రబాబు వైఖరిని తూర్పారబట్టిన వైఎస్సార్ సీపీ సాక్షి, హైదరాబాద్: విభజన చట్టం ప్రకారం ఏపీ రాష్ట్రానికి దక్కాల్సిన ప్రయోజనాలను అమలు చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం తాత్సారం చేస్తున్నప్పటికీ సీఎం చంద్రబాబు ఎందుకు మౌనం వహిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. తాను సీఎం అయితేనే.. రాష్ట్రాభివృద్ధి సాధ్యమని, ఇంకెవరికి ఓటేసినా అభివృద్ధి సాధ్యం కాదని చెప్పిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక కేంద్రం ఏ మాత్రమూ సాయం చేయకపోయినా మాట్లాడకపోవడానికి కారణం తెలియడం లేదని దుయ్యబట్టింది. ఈ మేరకు వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆదివారం మీడియాతో మాట్లాడారు. ‘ఇంత వరకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోగా, ఇచ్చే అవకాశం లేదని స్పష్టంగా చెబుతున్నప్పటికీ మీరు(చంద్రబాబు) కిమ్మనకుండా ఎందుకు ఉంటున్నారు? మీ పార్టీ ప్రయోజనాల కోసం, తెలుగువారి ఆత్మగౌరవాన్ని కే్రందానికి తాకట్టు పెడుతున్నారు తప్ప గట్టిగా మాట్లాడలేకపోతున్నారు. దీనిపై కనీసం ఒక్క లేఖ అయినా రాశారా? ఇస్తే ఇచ్చారు.. లేకపోతే లేదు అనే ధోరణితో మీరున్నారు. అడగలేకపోవడానికి.. మీపై ఏమైనా విచారణ చేస్తారని భయమా? లేక వారి నుంచి దూరంగా జరిగితే ప్రమాదం ఉందనుకుంటున్నారా?’ అని బాబుపై నిప్పులు చెరిగారు. ‘విభజన చట్టం ప్రకారం.. కొత్త రాష్ట్రం ఆవిర్భవించిన మొదలు 6 మాసాల వ్యవధిలోనే వైఎస్సార్ జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు అవకాశాలను సెయిల్ పరిశీలించాలి. ఏపీ గ్రీన్ ఫీల్డ్ క్రూడ్ ఆయిల్ రిఫైనరీ, పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటుపై పరిశీలన చేసి కేంద్రం తుది నిర్ణయం తీసుకోవాలి. వైజాగ్-చెన్నై పారిశ్రామిక కారిడార్ అవకాశాలను పరిశీలించాలి. వంటి హామీలు స్పష్టంగా ఉన్నాయి’ అని గుర్తుచేశారు. ‘రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న అన్యాయంపై మాటాడొద్దంటూ సహచర మంత్రులకు చెబుతున్న మీరు.. వారు మాట్లాడితే వచ్చే ప్రమాదమేమిటో చెప్పాలి’ అని ప్రశ్నించారు. వెంకయ్య ఏమీ చేయలేకపోతున్నారు విభజన హామీలు అమలు చేసే విషయంలో ఎన్నికలకు ముందుకు బ్రహ్మాండంగా మాట్లాడిన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అధికారంలోకి వచ్చాక అంతే బ్రహ్మాండంగా పనులు చేయలేకపోతున్నారని అంబటి దుయ్యబట్టారు. ఎన్నికలకు ముందు తిరుపతిలో జరిగిన ప్రచార సభలో ‘స్వర్ణాంధ్ర కావాలంటే చంద్రబాబును సీఎం చేయండి. మీ కోసం ఏం చేయడానికైనా నేను సిద్ధం’ అని వేంకటేశ్వరస్వామి సాక్షిగా మోదీ చెప్పారన్నారు. ‘ఎన్నికలకు ముందు టీడీపీ, బీజేపీ చేసిన బాసలు, ఊసులు ఇప్పుడు మర్చిపోయారు. ఇది సరైన పద్ధతి కాదు’ అని అన్నారు. సోనియా మాట్లాడరేం? రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఏపీ కాంగ్రెస్ నేతలు కోటి సంతకాల సేకరణ మొదలు పెట్టారు కానీ, విభజన బిల్లులో ప్రత్యేక హోదా ఎందుకు పెట్టలేదో, పార్టీ అధినేత్రి సోనియాగాంధీ దీనిపై కేంద్రంలో ఎందుకు ఒత్తిడి తీసుకురావడంలేదో చెప్పాలని అంబటి అన్నారు. తెలుగు ప్రజలను అగాథంలోకి నెట్టడంలో ప్రథమ ముద్దాయి కాంగ్రేసేనని, దానికి బీజేపీ , టీడీపీ కూడా వంత కలిపాయని దుయ్యబట్టారు. పీఆర్సీ విషయంలో సీఎం వైఖరి సహేతుకంగా లేదన్నారు.