ఎన్నికల కోడ్ ఎత్తివేత
ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్
సాక్షి, అమరావతి: స్థానిక ఎన్నికల సందర్భంగా అమల్లోకి తెచ్చిన ఎన్నికల కోడ్ను సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తక్షణమే ఎత్తేస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయానికి అందిన వెంటనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.
కోర్టు తీర్పులో ప్రత్యేకంగా పేర్కొన్న నిబంధనలను అనుసరించి ఈ ఉత్తర్వులు అమలులో ఉంటాయని పేర్కొన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థులు, మున్సిపల్ ఎన్నికల్లో ఇప్పటికే నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థులు, వారికి సంబంధించిన రాజకీయ పార్టీలు ఎలాంటి ఎన్నికల ప్రచారం నిర్వహించకూడదని తెలిపారు. ఎన్నికల నిర్వహణకు తిరిగి షెడ్యూల్ ప్రకటించే వరకు ఎన్నికల ప్రచారంపై నిషేధం అమలులో ఉంటుందని వెల్లడించారు.