29న ఏపీ ఎంసెట్ | Ap Eamcet On April 29th | Sakshi
Sakshi News home page

29న ఏపీ ఎంసెట్

Apr 27 2016 3:59 AM | Updated on Mar 23 2019 8:57 PM

రాష్ట్ర వ్యాప్తంగా ఇంజినీరింగ్, మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించనున్న ఎంసెట్‌కు విశాఖ రీజియన్ నుంచి 25,094 మంది విద్యార్థులు హాజరు కానున్నారని...

* హాజరు కానున్న 25,094 మంది  
* నిమిషం ఆలస్యమైనా అనుమతించరు
* ప్రాంతీయ సంచాలకుడు సుబ్రహ్మణ్యం వెల్లడి

 ఏయూక్యాంపస్ : రాష్ట్ర వ్యాప్తంగా ఇంజినీరింగ్, మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించనున్న ఎంసెట్‌కు విశాఖ రీజియన్ నుంచి 25,094 మంది విద్యార్థులు హాజరు కానున్నారని ప్రాంతీయ సంచాలకుడు ఆచార్య టి.సుబ్రహ్మణ్యం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంజినీరింగ్ విభాగంలో 18,076 విద్యార్థులు, మెడికల్ విభాగంలో 7,518 విద్యార్థులు ఈ నెల 29న పరీక్ష రాయనున్నారని పేర్కొన్నారు. విశాఖ రీజియన్ పరిధిలో 33 కేంద్రాలలో ఇంజినీరింగ్, 15 కేంద్రాలలో మెడికల్ ప్రవేశ పరీక్ష జరగనుందని తెలిపారు.

పరీక్ష కేంద్రానికి గంట ముందుగా చేరుకోవాలని సూచించారు. సమాధానాలను నలుపు, నీలం బాల్‌పాయింట్ పెన్నుతో మాత్రమే గుర్తించాలని సూచించారు. విద్యార్థులు తమ వెంట హాల్‌టికెట్, ఆన్‌లైన్ దరఖాస్తు, బాల్‌పాయింట్ పెన్నును మాత్రమే తీసుకురావాలని తెలిపారు. రిస్ట్ వాచీలు, కాలిక్యులేటర్లు, సెల్‌ఫోన్‌లు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలను తీసుకురాకూడదని పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాలలో ప్రాథమిక చికిత్సకు అవసరమైన ఏర్పాట్లు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ చేస్తోందని తెలియజేశారు.
 
అభ్యర్థులకు ఉచిత బస్ సౌకర్యం
మహారాణిపేట : ఈ నెల 29న ఆంధ్ర, వచ్చే నెల 2న తెలంగాణ ఎంసెట్‌కు హాజరయ్యే అభ్యర్థులకు ఉచిత బస్ సౌకర్యం కల్పిస్తున్నట్లు జేసీ-2 డి.వెంకటరెడ్డి తెలిపారు. పరీక్ష ముందు రోజు, పరీక్ష రోజు బస్సులు నడపనున్నట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు హాల్‌టికెట్లు చూపించి బస్సుల్లో ప్రయాణించవచ్చని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement