21న ధర్మవరంలో సీఎం జగన్ పర్యటన
సాక్షి, అనంతపురం: అనంతపురం జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన ఖరారు అయింది. ఈ నెల 21న ఆయన ధర్మవరంలో పర్యటించనున్నారు. ధర్మవరంలో ‘నేతన్న నేస్తం’ పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ధర్మవరం జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాట్లును మంత్రి శంకర్ నారాయణ, ముఖ్యమంత్రి ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురామ్, ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, కలెక్టర్ చంద్రుడు, జిల్లా ఎస్పీ సత్యా యేసుబాబు పరిశీలించారు.
కాగా వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం కింద సొంత మగ్గం కలిగిన చేనేత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి రూ.24 వేలు అందిస్తారు. సొంతంగా మగ్గాలున్న ప్రతి కుటుంబానికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనుంది. దారిద్ర్య రేఖకు దిగువన, మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబం ఈ పథకానికి అర్హులు.