మరో కొత్త అధ్యాయానికి సీఎం జగన్‌ శ్రీకారం

AP CM YS Jagan launch YSR Aarogyasri Filet Project In Eluru - Sakshi

వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ పైలట్‌ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం జగన్‌

2059 రోగాలకు ఆరోగ్య శ్రీ వర్తింపు

పారిశుద్ధ్య కార్మికుల జీతం రూ. 8 వేల నుంచి 16వేలకు పెంపు

ఏలూరు సభలో సీఎం జగన్‌

సాక్షి, ఏలూరు : పేద ప్రజలకు ఉచిత వైద్యం అందించే సంకల్పంతో ‘వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ’ పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. తనకు ఎంతో సంతృప్తికరమైన పథకం ఆరోగ్యశ్రీ అని పేర్కొన్నారు. ‘వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ’ పథకం పైలట్‌ ప్రాజెక్టుకు సీఎం జగన్‌ పశ్చిమ గోదావరి జిల్లాలో శ్రీకారం చుట్టారు. ఏలూరు ఇండోర్‌ స్టేడియంలో ఈ ప్రాజెక్టును ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్‌ ప్రసంగించారు. నూతన సంవత్సరంలో తమ ప్రభుత్వం ప్రారంభించిన రెండో సంక్షేమ కార్యక్రమం ఆరోగ్య శ్రీ అని తెలిపారు (మొదటిది ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం). దీని ద్వారా రాష్ట్ర చరిత్రలో మరో కొత్త అధ్యాయానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని సీఎం ప్రకటించారు. వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చే విధంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారని గుర్తుచేశారు. ప్రస్తుతం 1059 రోగాలకు మాత్రమే ఆరోగ్యశ్రీ వర్తిస్తోందని, ఆ సంఖ్యను 2059 రోగాలకు వర్తించే విధంగా పథకాన్ని రూపకల్పన చేశామన్నారు. ఫిబ్రవరి మొదటి వారం నుంచి క్యాన్సర్‌ రోగులకు ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా ఆరోగ్య శ్రీ ద్వారా ఉచిత చికిత్స అందిస్తామని సీఎం ప్రకటించారు. (నాడు వైఎస్సార్‌.... నేడు వైఎస్‌ జగన్‌)

సభలో సీఎం జగన్‌ ప్రసంగిస్తూ ‘పాదయాత్రలో ప్రజల కష్టాలకు అతిదగ్గరగా చూశా. అప్పులు చేయకుండా వైద్యం ఎలా అందించాలో ఆలోచించా. దానిలో నుంచి పుట్టిందే వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ పథకం విస్తరణ. ఏప్రిల్‌ నుంచి ప్రతినెల ఒక్కో జిల్లాలో 2029 వ్యాధులకు చికిత్స విస్తరణ జరుపుతాం. పాదయాత్రలో ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నా. నాడు చెప్పిన మాట ప్రకారం రూ.వెయ్యి దాటితో ఆరోగ్య శ్రీ వర్తింపచేస్తాం. రూ.ఐదు లక్షల ఆదాయంలోపు వారు ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకువస్తాం. అర్హలైన వారందరికీ ఆరోగ్య శ్రీ కార్డులు అందిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా కోటీ 42 లక్షల కార్డులను పంపిణీ చేస్తాం. వాటికి క్యూఆర్‌ నెంబర్లు కూడా జారీచేస్తాం. సచివాలయాల ద్వారా గ్రామాల్లో కార్డులను పంపిణీ చేస్తాం. ప్రతి 350 ఇళ్లకు ఆశా వర్కర్‌ను అటాచ్‌ చేస్తాం. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లోపే ఇచ్చిన మాట నెలబెట్టుకున్నాం. హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై నగరాల్లో 150 సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులను ఆరోగ్య నెట్‌వర్క్‌లో చేరుస్తాం. ఆపరేషన్‌ చేయించుకున్నాక విశ్రాంతి సమయంలో, రోజుకు రూ.225 లేదా నెలకు రూ.5వేలు ఆర్థిక సహాయం చేస్తాం.

పుట్టుకతో చెవుడు, మూగ ఉన్న పిల్లలకు ప్రభుత్వం తోడుగా ఉంటుంది. ప్రభుత్వాస్పత్రుల్లో 510 రకాల మందులను అందుబాటులోకి తీసుకువస్తాం. ఏప్రిల్‌ నుంచి డబ్ల్యుహెచ్‌వో ప్రమాణాలతో మందుల పంపిణి చేస్తాం. డయాలాసిస్‌ రోగులకు రూ.10వేల పెన్షన్‌ అందిస్తాం. పక్షవాతం, తలసేమియా రోగులకు రూ.5 వేలు పెన్షన్‌ అందిస్తాం. ఆస్పత్రుల్లో పారిశుధ్య కార్మికులకు జీతం రూ. 8 వేల నుంచి రూ. 16వేలు పెంపుతున్నాం. నాడునేడు కార్యక్రమంతో ఆస్పత్రుల రూపురేఖలు మారుస్తాం. మర్చినాటికి 1056 కొత్త అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచుతాం. మే నెలాఖరుకల్లా ఖాళీగా ఉన్న డాక్టర్‌, నర్సు పోస్టులకు భర్తీ చేస్తాం. పిల్లల భవిష్యత్‌ కోసం ప్రభుత్వం నాలుగడుగులు ముందుచేస్తోంది. ఈనెల 9న అమ్మ ఒడి కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తున్నాం. త్వరలోనే మధ్యాహ్నా భోజనంలో పౌష్టికాహారాన్ని అందిస్తాం’ అని సీఎం జగన్‌ అన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top