అన్న క్యాంటీన్..ఆర్భాటమే! | Andhra sample will be set up in the canteen. | Sakshi
Sakshi News home page

అన్న క్యాంటీన్..ఆర్భాటమే!

Feb 7 2015 1:31 AM | Updated on Jul 28 2018 6:48 PM

అధికారంలోకి రాగానే సీఎం చంద్రబాబు నాయుడు ‘తమిళనాడు రాష్ట్రంలో మాదిరి ఆంధ్రలోనూ అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తాం..

రాజంపేట టౌన్: అధికారంలోకి రాగానే సీఎం చంద్రబాబు నాయుడు ‘తమిళనాడు రాష్ట్రంలో మాదిరి ఆంధ్రలోనూ అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తాం.. రూ. 5కే పేదల కడుపు నింపుతాం’ అంటూ హడావుడి చేశారు. మరోవైపు మంత్రులు ఆర్భాటపు ప్రకటనలు చేశారు.
 
  ఆ పథకం అమలు తీరుపై అవగాహన  కోసం పౌర సరఫరాలశాఖ మంత్రి పరిటాల సునీతతో పాటు పలువురు ఐఏఎస్‌లు, మున్సిపల్‌శాఖ కమిషనర్లు తమిళనాడులో సైతం పర్యటించి వచ్చారు. కానీ రోజులు మారుతున్నా.. నెలలు గడుస్తున్నా అన్న క్యాంటీన్లు ఏర్పాటు కాదుకదా ఆ ఊసే లేకుండా పోరుుంది. తమిళనాడు పర్యటన కోసం రాష్ట్ర ప్రభుత్వం లక్షలాది రూపాయిల ప్రజా ధనం ఖర్చుచేసింది. తొలివిడతగా అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసేందుకు పలు మున్సిపాలిటీలను కూడా ఎంపిక చేశారు.
 
 ఇందులో జిల్లాలో టీడీపీ తరపున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే స్థానం రాజంపేట నియోజకవర్గం కావడంతో ఈ మున్సిపాలిటీని కూడా ప్రభుత్వం ఎంపిక చేసింది. అన్న క్యాంటీన్ల ఏర్పాటు విషయంలో అప్పట్లో రాష్ట్రంలోని మంత్రులు, అధికారుల హడావుడి చూసి ఇక్కడి నిరుపేదలంతా ప్రస్తుత కరవు కాలంలో ఒక పూట అయినా ఆకలి దప్పులు తీరుతాయని సంబర పడ్డారు. అంతేగాక పట్టణంలోని పాతబస్టాండు సమీపంలో ఉన్న మున్సిపల్ కాంప్లెక్స్‌లో అన్న క్యాంటీన్‌ను ఏర్పాటు చేసేందుకు ఇక్కడి మున్సిపల్‌శాఖ అధికారులు అక్కడి గదులను శుభ్రం చేయించారు. అయితే ఆరునెలలైనా ఇటు ముఖ్యమంత్రి కానీ, అటు మంత్రులు, అధికారులు కానీ అన్న క్యాంటీన్ల ఊసే ఎత్తక పోవడం, దీనికి తోడు అన్న క్యాంటీన్ ఏర్పాటుకు శుభ్రం చేసిన గదులు ప్రస్తుతం అపరిశుభ్రంగా తయారవడంతో ఇంతకీ అన్న క్యాంటీన్లు ఏర్పాటవుతాయా అన్న అనుమానం పేద ప్రజల్లో వ్యక్తమవుతోంది.
 
 మింగను మెతుకు లేకున్నా..
 ఒకవైపు కూలీలకు సరిగ్గా పనులు దొరకక, మరోవైపు కరవుతో జనం అల్లాడుతుంటే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రపంచస్థాయి రాజధానిని నిర్మిస్తాననడం హాస్యాస్పదంగా ఉందని పలువురు విమర్శిస్తున్నారు. చంద్రబాబునాయుడు ఇప్పటికైనా ఊహ ప్రపంచంలో విహరించకుండా కింది స్థాయిలో వాస్తవ పరిస్థితులను తెలుసుకుంటే పేద ప్రజలకు అంతో ఇంతో మేలు జరుగుతుందని వారు అంటున్నారు. అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిన మాజీ సీఎం దివంగత ఎన్టీఆర్‌ను ఆంధ్రులు అన్నా అని పిలుచుకుంటారని, అలాంటి పేరుతో చేపట్టాలనుకున్న పథకాన్ని కూడా చేపట్టక పోవడం బాబు ద్వంద్వ వైఖరికి నిదర్శనం.
 
 ఇంకా గైడ్‌లైన్స్ రాలేదు
 అన్న క్యాంటీన్‌కు రాజంపేట మున్సిపాలిటీ ఎంపికైంది. అయితే క్యాంటీన్ ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి గైడ్‌లైన్స్ రాలేదు. అన్న క్యాంటీన్ ఏర్పాటుపై ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వస్తే ఏర్పాటు చేస్తాం.
 -ఫజులుల్లా, మున్సిపల్ కమిషనర్, రాజంపేట.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement