ఉల్లంఘనలు ‘కన్నారా | all set for muncipal elections | Sakshi
Sakshi News home page

ఉల్లంఘనలు ‘కన్నారా

Mar 5 2014 1:18 AM | Updated on Oct 16 2018 6:33 PM

గుంటూరు నగరంలో ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గంలో తాజా మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణకు అనుకూలంగా పెద్ద ఎత్తున గోడ రాతలు వెలిశాయి.

 ఎన్నికల నియమావళి ఉల్లంఘించిన కాంగ్రెస్
 కేంద్ర మంత్రి జై రాం రమేష్ పర్యటన ఆద్యంతం అధికార దుర్వినియోగం
 చోద్యం చూస్తున్న మున్సిపల్ అధికార గణం
 ప్రభుత్వ ఆస్తులపైనా టీడీపీ, బీజేపీల ప్రచారం
 
 మున్సి‘పోల్స్’ నేపథ్యంలో జిల్లాలో సోమవారం నుంచే ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చింది. కేవలం పట్టణ ప్రాంతాల్లోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలవు తోంది. అయితే అధికార యంత్రాంగం మాత్రం కోడ్ ఉల్లంఘనపై కన్నెత్తి చూడటం లేదు. ఉల్లం‘ఘనుల’పై కొరడా ఝళిపించడం లేదు. మరో వైపు బుధవారం నుంచి సార్వత్రిక ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి రానుంది.
 
 సాక్షి, గుంటూరు
 గుంటూరు నగరంలో ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గంలో  తాజా మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణకు అనుకూలంగా పెద్ద ఎత్తున గోడ రాతలు వెలిశాయి. ఏకంగా ప్రభుత్వ ఆస్తులపైనే ప్రచారానికి తెగబడ్డారు. టీడీపీ, బీజేపీలు తామేమీ తీసిపోమన్న విధంగా గోడ రాతలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాయి. సత్తెనపల్లి, నరసరావుపేటలో టీడీపీ పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. ప్రధానంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోనే అడుగడుగునా మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణకు అనుకూలంగా విద్యుత్ సబ్ స్టేషన్లపైనా, ఫ్లై ఓవర్‌ల పైనా కలెక్టరేట్ రోడ్డులోనూ కన్నా హయాంలో అంత అభివృద్ధి.. ఇంత అభివృద్ధి అంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాతలు రాసి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.
 
  మరోవైపు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో కేంద్ర మంత్రి జై రాం రమేష్ మంగళవారం గుంటూరు నగరంలో హల్‌చల్ చేశారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ర్యాలీలు నిర్వహించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు బలప్రదర్శనలు, ర్యాలీలు జరపకూడదు.  ఈ నిబంధన అతిక్రమించి మరీ జిల్లా సరిహద్దు తాడేపల్లి నుంచి భారీ కాన్వాయ్‌తో కేంద్ర మంత్రి పర్యటించారు. నిబంధనలు ఉల్లంఘించి హామీలు, వాగ్దానాలు ఇవ్వడంతో పలువురు ఈసీకి ఫిర్యాదులు చేశారు. ఇంతటి స్థాయిలో అధికార దుర్వినియోగం జరుగుతున్నా, కోడ్ అమలు బాధ్యతలు పర్యవేక్షించాల్సిన అధికారులు మిన్నకుండి పోయారు. మరో వైపు సార్వత్రిక ఎన్నికల కోడ్ కూడా బుధవారం నుంచి అమల్లోకి రానుంది.
 
 నోటీసులు జారీ చేయాలని వారం  క్రితమే కలెక్టరు ఆదేశాలు
     మున్సిపల్ ఎన్నికల కోడ్ అమల్లోకి రాకమునుపే జిల్లా కలెక్టరు ఎస్.సురేశ్‌కుమార్ పట్టణాల్లో అనధికార హోర్డింగులు, గోడ రాతలు, ఫ్లెక్సీలు తొలగించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
 
     తొలగించిన ఖర్చు ఏర్పాటు చేసిన వారి నుంచే వసూలు చేయాలని సూచించారు.  నోటీసులకు స్పందించకుంటే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కలెక్టరు ఆదేశించారు.
 
     ఎన్నికల కోడ్ అమలు ప్రస్తుతం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పర్యవేక్షిస్తోంది.
     తాజా మాజీ మంత్రి కన్నా పేరుతో వెలసిన గోడ రాతల్ని తక్కువ ఖర్చుతో పెయింటింగ్ వేసి వెంటనే చర్యలు తీసుకోవాల్సిన కార్పొరేషన్ అధికారులు నేతల అడుగులకు మడుగులొత్తుతున్నారనే ఆరోపణలున్నాయి.
 
     కార్పొరేషన్ పరిధిలో కోడ్ ఉల్లంఘనకు సంబంధించి సూచనలు చేసినా పెడచెవిన పెట్టడంపై జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
     అధికారుల  కళ్ళెదుటే గోడ రాతలు కనిపిస్తున్నా, ఇంతవరకు చర్యలు తీసుకోకపోవడంపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.
 
     గుంటూరు నగర పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి జైరాం రమేష్‌ను ప్రసన్నం చేసుకునేందుకు తాజా మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ బ్యానర్లు కట్టి కోడ్ ఉల్లంఘనకు పాల్పడినా అధికారులు పెద్దగా పట్టించుకోలేదు.
 
     గుంటూరు తూర్పు ఎమ్మెల్యే షేక్ మస్తాన్‌వలి మరో అడుగు ముందుకేసి ద్విచక్ర వాహనాలతో ర్యాలీ నిర్వహించారు.
 
     మరో వైపు నరసరావుపేట మున్సిపాలిటీ పరిధిలో మాజీ మంత్రి డాక్టర్ కోడెల శివప్రసాదరావు ఆత్మీయపాదయాత్ర పేరుతో చేస్తున్న ఎన్నికల ప్రచార కార్యక్రమంలో వీధులన్నీ పచ్చ తోరణాలతో, పార్టీ బ్యానర్లతో  కళకళలాడుతున్నా అధికారులకు మాత్రం ఇవేమీకనిపించలేదు.
 
     ఇతర పార్టీల నాయకులు ఫిర్యాదులు చేసినా  వినిపించనట్లే   ఉండిపోయారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement