నేడు ఆంధ్రప్రదేశ్‌ బంద్‌..

All preparation done for today's strike - Sakshi

వైఎస్సార్‌సీపీ, కాంగ్రెస్, ప్రజాసంఘాల మద్దతు 

ప్రజా సంకల్ప యాత్రకు విరామం ప్రకటించిన జగన్‌ 

సాక్షి, అమరావతి:  కేంద్ర ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందంటూ వామపక్షాలు ఇచ్చిన పిలుపు మేరకు గురువారం రాష్ట్ర బంద్‌కు సర్వం సిద్ధమైంది. బంద్‌కు అన్ని సన్నాహాలు చేసినట్టు వామపక్ష పార్టీలు ప్రకటించాయి. విద్యా, వ్యాపార, వాణిజ్య సంస్థలు బంద్‌ సందర్భంగా స్వచ్ఛందంగా మూసివేయనున్నట్లు తెలిపాయి.

ప్రభుత్వ సంస్థలు యధావిధిగా నడుస్తాయని అధికారవర్గాలు పేర్కొన్నా వాటినీ అడ్డుకుంటామని బంద్‌కు మద్దతు ఇస్తున్న ప్రజా సంఘాలు పేర్కొన్నాయి. కేంద్ర బడ్జెట్‌లో ప్రత్యేక హోదా, రాష్ట్ర రాజధాని నిర్మాణం మొదలు పోలవరం నిర్మాణం, ప్రత్యేక రైల్వేజోన్‌ వంటి అంశాల ప్రస్తావన ఏదీ లేకపోవడాన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు తీవ్రంగా ఆక్షేపించాయి.

రాష్ట్రం పట్ల కేంద్రం అనుసరిస్తున్న తీరును గర్హిస్తూ వామపక్షాలు బంద్‌కు పిలుపునివ్వగా ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ, కాంగ్రెస్‌ పార్టీ, లోక్‌సత్తాతో పాటు కేంద్ర కార్మిక, ఇతర ప్రజా సంఘాలతో పాటు ప్రత్యేక హోదా సాధన సమితి వంటివి మద్దతు పలికాయి. ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన ప్రజా సంకల్ప యాత్రకు విరామం ప్రకటించి బంద్‌కు మద్దతు తెలిపారు.

రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రజలంతా ఒక్కటిగా నిలబడి బంద్‌ను విజయవంతం చేయాలని వైఎస్సార్‌సీపీ కోరింది. బంద్‌కు మద్దతు ప్రకటించాలంటూ సీఎంకు సీపీఐ బుధవారం బహిరంగ లేఖ రాసింది. బంద్‌ వల్ల ప్రజలు ఇబ్బంది పడతారని బాబు వ్యాఖ్యానించడాన్ని ప్రజాసంఘాలు తప్పుబట్టాయి.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top