అమ్మో.. ఆ పనులా! | Additional classrooms in public schools | Sakshi
Sakshi News home page

అమ్మో.. ఆ పనులా!

Feb 20 2015 1:09 AM | Updated on Sep 2 2017 9:35 PM

ప్రస్తుత విద్యా సంవత్సరం మరో రెండు నెలల్లో ముగియనుంది. ప్రభుత్వ పాఠశాలల్లో అదనపు తరగతి గదులు నిర్మించి

ఏలూరు :ప్రస్తుత విద్యా సంవత్సరం మరో రెండు నెలల్లో ముగియనుంది. ప్రభుత్వ పాఠశాలల్లో అదనపు తరగతి గదులు నిర్మించి కొత్త విద్యా సంవత్సరంలోనైనా విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చే పరిస్థితి కనిపించటం లేదు. పుష్కలంగా నిధులున్నా.. నిర్మాణాలు చేపట్టేందుకు కాం ట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. దీంతో జిల్లాలో 148 పాఠశాలల్లో అదనపు తరగతి గదుల నిర్మాణంపై నీలినీడలు కమ్ముకున్నాయి. రాష్ట్రీయ మాధ్యమిక శిక్షాభియాన్ (ఆర్‌ఎంఎస్‌ఏ) మూడో దశ కింద పాఠశాలల్లో అదనపు గదుల నిర్మాణానికి రూ. 48.33 కోట్లు మంజూరయ్యాయి. ఈ మేరకు 2013 నవంబర్‌లో జీవో నంబర్-64 విడుదలైంది. ఈ పనులకు సంబంధించి నేటివరకూ ఒక్క పాఠశాలలోనూ పునాది రాయి పడలేదు. ఈ పనుల ఆధారంగానే సాంఘిక సంక్షేమ శాఖ ఇంజినీరింగ్ అధికారులకు జీతాలు విడుదలవుతుం టాయి. పనులు ప్రారంభం కాకపోవడంతో ఏమిటీ వింత పరిస్థితి అని ఇంజినీరింగ్ అధికారులు వాపోతున్నారు.
 
 టెండర్లు రాలేదు మరి
 జిల్లాలో 145 జెడ్పీ హైస్కూళ్లు, మూడు సాంఘిక సంక్షేమ పాఠశాలలు, కళాశాలల్లో తరగతి గదుల నిర్మాణానికి రూ.48.33 కోట్లు నిధులొచ్చాయి. ఈ పనులకు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. నిన్నమొన్నటి వరకూ ఇసుక కొరత ఇబ్బంది పెట్టింది. తాజాగా సిమెంట్ ధరలు పెరిగాయి. ఈ కారణాల వల్ల కాంట్రాక్టర్లు పనులు చేపట్టేందుకు ముందుకు రావడం లేదు. ఫలితంగా ఒక్క తరగతి గది నిర్మాణానికైనా టెండర్లు దాఖలు కాలేదు. ఒక్కొక్క పని విలువ రూ.15 లక్షల నుంచి రూ.45 లక్షల వరకు ఉంది. చాలా పనులకు రెండు నుంచి నాలుగుసార్లు టెండర్లు ఆహ్వానించారు. ఒక్కరు కూడా ముందుకు రాకపోవడంతో వచ్చే విద్యాసంవత్సరంలో అయినా పాఠశాలల్లో అదనపు తరగతుల నిర్మాణం మొదలయ్యే పరిస్థితి కనిపించడం లేదు.
 

Advertisement
 
Advertisement
Advertisement