పోలీసుల అదుపులో అలేఖ్య | Accountant alekhya arrested to cheating of ICICI prudential bheema company | Sakshi
Sakshi News home page

పోలీసుల అదుపులో అలేఖ్య

Feb 5 2015 1:59 PM | Updated on Sep 19 2018 8:43 PM

అలేఖ్యను కోర్టుకు తీసుకెళుతున్న పోలీసులు - Sakshi

అలేఖ్యను కోర్టుకు తీసుకెళుతున్న పోలీసులు

చిత్తూరు నగరంలోని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ బీమా కంపెనీలో ఖాతాదారుల సొమ్ము స్వాహా చేసిన అకౌంటెంట్ అలేఖ్య(24)ను పోలీసులు పట్టుకున్నారు.

* పోలీసుల కళ్లుగప్పి కెనడాకువెళ్లే ప్రయత్నం
* చాకచక్యంగా వ్యవహరించిన పోలీసు శాఖ
* ఆమెతో పాటు తల్లిదండ్రుల అరెస్టు

 
 చిత్తూరు (అర్బన్): చిత్తూరు నగరంలోని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ బీమా కంపెనీలో ఖాతాదారుల సొమ్ము స్వాహా చేసిన అకౌంటెంట్ అలేఖ్య(24)ను పోలీసులు పట్టుకున్నారు. పది మందికి పైగా బీమా సొమ్ము చెల్లించిన వారి నుంచి రూ.31 లక్షలు కాజేసిన విషయంపై బ్రాంచ్ మేనేజరు శ్రీధర్ మంగళవారం చిత్తూరు టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అప్పటికప్పుడు స్పందించిన సీఐ సూర్యమోహనరావు బుధవారం ఉదయానికే నెల్లూరులోని అలేఖ్య స్వగ్రామానికి చేరుకున్నారు. అలేఖ్యతో పాటు ఆమె తల్లిదండ్రులు వెంకటేశ్వరరావు(55), రాజ్యలక్ష్మి (50)లను సైతం అదుపులోకి తీసుకుని చిత్తూరుకు తరలించి, ఇక్కడ అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించారు.
 
 పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఖాతాదారులు చెల్లించే నగదును అలేఖ్య తన తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాల్లోకి ఆన్‌లైన్ ద్వారా రూ.31 లక్షలు జమ చేసింది. ఏ రోజుకారోజు బ్యాంకు ఖాతాల్లో జమయ్యే నగదును ఆమె తల్లిదండ్రులు విత్‌డ్రా చేసుకునే వాళ్లు. జరిగిన మోసాన్ని ఆలస్యంగా గుర్తించిన ఐసీఐసీఐ బీమా కంపెనీ ప్రతినిధులు అలేఖ్య తల్లిదండ్రుల ఖాతాల్లో ఉన్న నగదును ఫ్రీజింగ్ చేయాలని నెల్లూరులోని బ్యాంకు అధికారులను కోరడంతో ఖాతాలో ఉన్న రూ.2 లక్షలు మాత్రం ఇటీవల విత్‌డ్రా కాకుండా చేయగలిగారు. అలేఖ్య తండ్రి నెల్లూరు ఆర్టీసీలో పనిచేస్తున్నాడు. ఇతను కొంత కాలంగా మెడికల్ సెలవులో ఉన్నాడు. నిందితులకు పట్టుకోవడానికి వెళ్లిన చిత్తూరు పోలీసులు పలు ఆసక్తికర విషయాలను గుర్తించారు. గత నెల 23న ఈ కుంభకోణం వెలుగు చూడడం.. అదే నెల 19నే అలేఖ్య ఉద్యోగానికి రాజీనామా చేయడం జరిగింది.
 
 అంటే ముందుగానే ప్రణాళిక రూపొందిం చుకున్నారు. దీనికితోడు అలేఖ్య తన తల్లిదండ్రులు వెంకటేశ్వరరావు, రాజ్యలక్ష్మితో కలిసి కెనడా వెళ్లడానికి పాస్‌పోర్టులకు సైతం దరఖాస్తు చేసుకున్నారు. పాస్‌పోర్టు రావడం కాస్త ఆలస్యం కావడంతో దానికోసం వేచి చూస్తూ పోలీసులకు దొరికిపోయారు. అలేఖ్య, వెంకటేశ్వరరావు, రాజ్యలక్ష్మిపై ఛీటింగ్ తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన సీఐ సూర్యమోహనరావు వారిని అరెస్టు చేసి, చిత్తూరులోని నాలుగో అదనపు మునిసిఫ్ మేజిస్ట్రేట్ కోర్టుకు తరలించారు. వీళ్లకు 14 రోజుల రిమాండు విధిస్తూ న్యాయమూర్తి యుగంధర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం నిందితులను చిత్తూరు నగరంలోని జిల్లా జైలుకు తరలించారు. పోలీసులను పలువురు అభినందించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement