టాలీవుడ్ హీరో తారకరత్న.. చాలా చిన్న వయసులోనే చనిపోయారు. 2023 ఓ పాదయాత్రలో పాల్గొన్న ఈయన.. డీహైడ్రేషన్కి గురై అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు. హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్తే.. దాదాపు 23 రోజుల పాటు ప్రాణాలతో పోరాడినప్పటికీ ఫలితం లేదు. ఈయన మరణం తర్వాత భార్య అలేఖ్య పెద్దగా బయట కనిపించలేదు. సోషల్ మీడియాలో అప్పుడప్పుడు భర్తని తలుచుకుని పోస్టులు పెట్టేవారు. అయితే ఆస్పత్రిల్లో ఉన్న తారకరత్న చివరి రోజులు ఎలా గడిచాయి? అప్పుడు ఏమేం జరిగిందనేది అనే విషయాల్ని తొలిసారి ఇప్పుడు ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు.
(ఇదీ చదవండి: డైరెక్ట్ ఓటీటీలో రిలీజైన తెలుగు హారర్ థ్రిల్లర్ సినిమా)
'పాదయాత్రలో పాల్గొనేందుకు జనవరి 25నే వెళ్లాలి. కానీ అనుకోకుండా రెండు రోజుల తర్వాత వెళ్లారు. ఆ రోజు ఉదయమే ఫోన్ చేశారు. సాయంత్రానికల్లా వచ్చేసి పిల్లలతో కలిసి సినిమా చూస్తానని కూడా చెప్పారు. కానీ కాసేపటికే తారక్కి డీహైడ్రేషన్ అయిందని చెప్పి ఫోన్ వచ్చింది. మా అమ్మ కాల్ చేసి బాల బాబాయ్కి ఫోన్ చేయమంటే చేశా. ఆయన కూడా అదే చెప్పారు. తర్వాత విజయ్ సాయిరెడ్డి బాబాయ్ కాల్ చేసి.. నిష్క(తారకరత్న పెద్ద కూతురు)ని తీసుకుని కుప్పం వెళ్లమన్నారు. అప్పుడు చంద్రబాబు ఫోన్ చేశారు. అంతా బిజీగా ఉండే ఆయన కూడా ఫోన్ చేసేసరికి ఏదో సీరియస్ అని అర్థమైంది. దీంతో కుప్పం వెళ్లాను. అక్కడ తారకరత్నని బెడ్పై చూసి కుప్పకూలిపోయాను'
'బాల బాబాయ్ నా దగ్గరుండి అన్ని చూసుకున్నారు. మా అన్నయ్య బెస్ట్ హాస్పిటల్కి తీసుకెళ్దామని అంటే బెంగళూరు తీసుకెళ్లాం. అలా 23 రోజుల పాటు ఆస్పత్రిలో ఉన్నారు. చాలా పోరాడారు. నా కోసమే నాకు సమయం ఇచ్చేందుకే అన్ని రోజులు పోరాడారా అనిపించింది. నా కోసం అందరూ ఆస్పత్రిలోనే ఉన్నారు. నేను అందరినీ వెళ్లిపోమని చెప్పా. డాక్టర్స్ వచ్చి అంతా అయిపోయింది అని చెప్పగానే మొదట బాల బాబాయ్కి ఫోన్ చేసి విషయం చెప్పాను. తర్వాత అందరికీ చెప్పాను. తారకరత్నతో చివరి నిమిషం వరకు ఉన్నాను. ఆయనతో పాటు బెడ్పై పక్కనే పడుకుని చివరి గుండె చప్పుడు కూడా విన్నాను. చాలా నెలల వరకు ఆయన లేరని నిజాన్ని అంగీకరించలేకపోయాను' అని అలేఖ్య అప్పటి సంగతుల్ని గుర్తుచేసుకుంది.
తారకరత్న విషయానికొస్తే.. 2002లో హీరోగా కెరీర్ ప్రారంభించారు.2023 వరకు అడపాదడపా మూవీస్ చేశారు గానీ సక్సెస్ కాలేకపోయారు. అయితే అప్పటికే పెళ్లయి విడాకులు తీసుకున్న అలేఖ్యని ప్రేమించి 2012లో వివాహం చేసుకున్నారు. ఇరు కుటుంబాలు అంగీకరించకపోయినా సరే ఈ నిర్ణయం తీసుకున్నారు. వీళ్లకు 2013లో ఓ పాప పుట్టగా.. తర్వాత ట్విన్స్ అయిన బాబు, పాప పుట్టారు.
(ఇదీ చదవండి: ఊహించని దర్శకుడితో ప్రభాస్.. రొయ్యల బిర్యానీతో డిన్నర్)


