'అ!' సినిమాతో కెరీర్ మొదలుపెట్టిన సంగీత దర్శకుడు మార్క్ కె రాబిన్.. టాలీవుడ్లో మంచి పేరుని సంపాదించుకున్నాడు. హైదరాబాద్లో పుట్టి పెరిగిన ఇతడు.. తన సంగీతంతో ఆకట్టుకుంటున్నాడు. తెలంగాణ ప్రభుత్వం తాజాగా ప్రకటించిన గద్దర్ అవార్డ్ ఇతడికి దక్కింది. 'దండోరా' చిత్రానికిగానూ మార్క్ కె రాబిన్కి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్గా ఈ పురస్కారం అందుకున్నాడు. సినిమాలోని పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్కి మరీ ముఖ్యంగా "దండోరా" టైటిల్ సాంగ్ ప్రేక్షకులని కదిలించాయి.
టాలీవుడ్ లో మల్లేశం, జాంబీ రెడ్డి, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ తదితర సినిమాలకు కూడా ఇతడే సంగీతమందించాడు. ఇప్పటివరకు దాదాపు 20కి పైగా చిత్రాలకు సంగీతాన్ని అందించాడు.చిన్నప్పటి నుంచి గద్దర్ పాటలు అంటే ఇష్టమని, ఆయన పాటలు వింటూ పెరిగిన తనకు ఇప్పుడు గద్దర్ అవార్డు రావడం ఆనందంగా ఉందని చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, జ్యూరీ సభ్యులకు ధన్యవాదాలు తెలిపాడు.


