ఏపీలో మరో 12 ‘దిశ’ పోలీస్‌స్టేషన్లు | 12 Disha Police Stations To Be Opened On 8 March | Sakshi
Sakshi News home page

మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యత

Mar 6 2020 12:20 PM | Updated on Mar 6 2020 1:35 PM

12 Disha Police Stations To Be Opened On 8 March - Sakshi

సాక్షి, విజయవాడ: మహిళల భద్రతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆరు జిల్లాల్లో ‘దిశ’ పోలీస్ స్టేషన్లు ప్రారంభించామని.. మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా మరో 12 దిశ పోలీస్‌స్టేషన్లను ప్రారంభిస్తున్నామని ఆయన వెల్లడించారు. దిశ-2019 చారిత్రాత్మక బిల్లును ఏపీ శాసనసభ ఆమోదించిందని.. రాష్ట్రపతి ఆమోదం రావాల్సి ఉందన్నారు. మహిళలకు రక్షణ కల్పించడంలో ఏపీ పోలీసులు ముందంజలో ఉన్నారన్నారు. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. దిశా చట్టానికి సంబంధించిన ఫ్రేమ్ వర్క్ పూర్తి చేస్తున్నామని   వెల్లడించారు. (అందుకే దిశ చట్టం తీసుకువచ్చాం: సీఎం జగన్‌)

మహిళా పీఎస్‌లు అప్‌గ్రేడ్‌..
‘దిశ’ చట్టం అమలులో భాగంగా 13 జిల్లాల్లో ప్రత్యేక కోర్టులతో పాటు విశాఖ, తిరుపతిలో ‘దిశ’ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తున్నామని డీజీపీ వెల్లడించారు. మహిళా పీఎస్‌లను ‘దిశ’ ఉమెన్‌ పోలీస్‌స్టేషన్లుగా అప్‌గ్రేడ్‌ చేస్తున్నామని  పేర్కొన్నారు. ‘దిశ ఎస్ఓఎస్ యాప్’ కు ఇరవై ఐదురోజుల్లో 86 క్రియాశీలక కాల్స్ వచ్చాయన్నారు.  ఇరవై ఆరు కేసుల్లో ఎఫ్ఐఆర్ లు నమోదు అయ్యాయని పేర్కొన్నారు.

భర్త వేధింపులు,ఈవ్ టీజింగ్ మెసేజ్ లపై ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ‘దిశ యాప్‌’ను రెండు లక్షల మంది డౌన్‌ లోడ్‌ చేసుకున్నారని తెలిపారు. 14 వేల కాల్స్‌ వచ్చాయన్నారు. స్పందనలో 52 శాతం మహిళలు ఫిర్యాదు ఇవ్వడం మార్పుకు నిదర్శనమన్నారు. నేరాలను పూర్తిస్థాయిలో నియంత్రించేందుకు సైబర్ మిత్రా ఏర్పాటు చేసామని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 206 జీరో ఎఫ్‌ఐఆర్‌లు నమోదు అయ్యాయన్నారు. సైబర్‌ మిత్రకు ‘9121211100’  వాట్సాప్‌ ద్వారా ఫిర్యాదు చేయొచ్చని డీజీపీ పేర్కొన్నారు. (దశ 'దిశ'లా స్పందన)

Advertisement
 
Advertisement
Advertisement