బొజ్జ గణపయ్య పండుగ వచ్చేస్తోంది. ఏటా చవితికి నెల రోజుల ముందే కేసీ కెనాల్ నీటితో పాత కడప చెరువును కళకళలాడించి, నిమజ్జనానికి రూట్ క్లియర్ చేయడం కడప నగరంలో ఆనవాయితీ. కానీ, ఈసారి సీన్ రివర్స్ అయింది! మన ‘కూటమి’ మున్సిపల్ అధికారులు, పాలకులు భక్తి కంటే ‘కక్ష సాధింపు’ ధ్యాసలోనే మునిగిపోయారు. ప్రతిపక్ష నేతలపై కేసులు పెట్టడం, పాత ఆస్తుల లెక్కలు తేల్చడంలో చూపించిన శ్రద్ధ.. నగర పాలనపై దృష్టి పెట్టడం పూర్తిగా మరిచారు. ఫలితంగా పాత కడప చెరువు ఇప్పటికీ చుక్క నీరు లేక వెక్కిరిస్తోంది. వారం రోజుల్లో పండుగ పెట్టుకుని ఇప్పుడు నీరెలా నింపుతారో ఆ వినాయకుడికే ఎరుక! నెల రోజుల నుంచి నగరవాసులకు కనీసం తాగడానికి మంచి నీళ్లివ్వలేని ఈ ‘మహా’ యంత్రాంగం.. ఇప్పుడు లంబోదరుడిని బురదలో ముంచుతుందో, ఎండు చెరువులో కూర్చోబెడుతుందోనని ఉత్సవ కమిటీ సభ్యులు మండిపడుతున్నారు. ‘స్వామీ విఘ్నేశ్వరా.. భక్తుల కష్టాలు ఎలాగూ తీరుస్తావు..ముందు మన పాలకుల అజ్ఞానాన్ని కాస్త తొలగించు తండ్రి!’ అంటూ ప్రజలు ప్రార్థిస్తున్నారు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, కడప


