వేముల: తీవ్ర వర్షాభావ పరిస్థితులు, ఎల్నినో ప్రభావం పులివెందుల నియోజకవర్గ ఖరీఫ్ రైతులను నిలువునా ముంచాయి. జూన్ నెలలో కురిసిన అరకొర వర్షాలకు వరుణుడు కరుణిస్తాడనే ఆశతో నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు 13వేల ఎకరాలకుపైనే పత్తి, వేరుశనగ పంటలను సాగు చేశారు. అయితే వేరుశనగ సాగు చేసి 80 రోజులు, పత్తి సాగు చేసి 60 రోజులు దాటుతున్నా ఇప్పటివరకు ఒక్క చినుకు కూడా పడకపోవడంతో చేలన్నీ ఎండ దశకు చేరుకున్నాయి. వేరుశనగ సాగుకు విత్తనాలు, ఎరువులు, సేద్యాల కోసం ఎకరాకు రూ. 35 వేలకు పైనే అప్పులు చేసి పెట్టుబడులు పెట్టామని, ఇప్పుడు పంట చేతికి వచ్చే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు. మరోవైపు వర్షాకాలంలోనూ వేసవిని తలపించేలా ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో భూమిలో తేమ అడుగంటింది. మరో రెండు వారాల్లో వర్షాలు రాకపోతే వేరుశనగను పూర్తిగా దున్నేయాల్సి వస్తుందని రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రభుత్వం కరువును సమీక్షించి, ఆదుకోవాలని రైతన్నలు వేడుకుంటున్నారు.


