ప్రొద్దుటూరు రూరల్: చాపాడు మండలం చెంచుపల్లె గ్రామ సమీపంలోని 150 ఎకరాల విస్తీర్ణమున్న మడూరు చెరువు ఎల్నినో ప్రభావం, తీవ్ర వర్షాభావం వల్ల పూర్తిగా ఎండిపోయింది. ప్రతి ఏడాది వర్షపు నీరు, కేసీ కెనాల్ నీటితో కళకళలాడే ఈ చెరువు ఇప్పుడు ఎడారిని తలపిస్తోంది. చెరువులో అక్కడక్కడా గుంతల్లో మిగిలిన కొద్దిపాటి బురద నీటిలో వందలాది చేపలు ప్రాణాల కోసం విలవిలలాడుతున్నాయి. నీటిలో ఆక్సిజన్ తగ్గిపోవడంతో చేపలు పైకి వచ్చి అల్లాడుతూ ఇప్పటికే పెద్ద సంఖ్యలో మృత్యువాత పడ్డాయి. ఈ దయనీయ దృశ్యాలు చూసేవారి మనసులను కలిచివేస్తున్నాయి. చుట్టుపక్కల గ్రామాల ప్రజలతో పాటు ప్రొద్దుటూరు పట్టణం నుంచి జనం వచ్చి ఈ చేపలను పట్టుకెళ్తున్నా ఇంకా వందలాది చేపలు బురదలోనే ప్రాణాలు వదులుతున్నాయి. అయితే, ఈ రకం చేపలకు మార్కెట్లో పెద్దగా గిరాకీ లేకపోవడంతో వ్యాపారులు కొనుగోలు చేయడానికి ముందుకు రావడం లేదు. వేలాది జీవులకు ఆశ్రయమిచ్చిన చెరువు.. ఇప్పుడు వాటి మృత్యువేదికగా మారడం స్థానికులను తీవ్ర విషాదానికి గురిచేస్తోంది.


