కడప రూరల్: ఈనెల 9వ తేదీన కడపలో ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళన సభను నిర్వహిస్తున్నట్లు ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బి.శ్రీనివాసులు తెలిపారు. ఆ రోజు ఉదయం 10 గంటలకు జిల్లా పరిషత్ మీటింగ్ హాలులో జరిగే ఈ సభకు ముఖ్యఅతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు అలపర్తి విద్యాసాగర్, ప్రధాన కార్యదర్శి డీవీ రమణ హాజరవుతారని పేర్కొన్నారు. జిల్లాలోని ఉద్యోగులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.
జైళ్ల శాఖ రాయలసీమ డీఐజీగా రాజేశ్వరరావుకు పదోన్నతి
కడప అర్బన్: జైళ్ల శాఖ రాయలసీమ రేంజ్ డీఐజీగా ప్రస్తుతం కడప కేంద్ర కారాగారం సూపరింటెండెంట్గా పనిచేస్తున్న రాజేశ్వరరావుకు పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈయన గత కొన్ని సంవత్సరాలుగా కడప కేంద్ర కారాగార సూపరింటెండెంట్గా విధులను నిర్వహించారు. ప్రస్తుతం కడప కేంద్ర కారాగారం డిప్యూటీ సూపరింటెండెంట్గా పనిచేస్తున్న వెంకటేశ్వరరావుకు సూపరింటెండెంట్గా పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించారు.
ఫిర్యాదులను గడువులోగా పరిష్కరించాలి
కడప అర్బన్: జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ప్రజలను నేరుగా కలిసి వారి సమస్యలను తెలుసుకుని ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు వివిధ సమస్యలపై మొత్తం 153 ఫిర్యాదులను సమర్పించారు.ప్రతి ఫిర్యాదును స్వయంగా పరిశీలించిన ఎస్పీ, సంబంధిత పోలీస్ అధికారులతో నేరుగా ఫోన్లో మాట్లాడారు.వీటిని నిర్ణీత గడువులోగా పరిష్కరించి, బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ ఎన్. సుధాకర్, కడప డీఎస్పీ బాలస్వామి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కర్నూల్ రేంజ్ హాకీ జట్టుకు అభినందనలు
కడప అర్బన్: రాష్ట్రస్థాయిలో ఇటీవల జరిగిన పోలీస్ స్పోర్ట్స్ మీట్ లో కర్నూల్ రేంజ్ హాకీ జట్టు రెండో స్థానం సాధించింది. కర్నూల్ రేంజ్ హాకీ జట్టులో (కడప పోలీస్ టీమ్) సభ్యులను సోమవారం కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలను సాధించాలని డీఐజీ ఆకాంక్షించారు.


