ప్రొద్దుటూరు క్రైం : ప్రొద్దుటూరులో వ్యవస్థీకృతంగా పేకాట నిర్వహిస్తున్న ముఠాపై వన్టౌన్ పోలీసులు మెరుపుదాడి చేశారు. అరెస్ట్ వివరాలను సోమవారం ప్రొద్దుటూరు ఏఎస్పీ విభూకృష్ణ మీడియాకు వెల్లడించారు. గాంధీరోడ్డు సమీపంలోని గిడ్డంగివీధిలో కొంత కాలంగా పెద్ద ఎత్తున ఆర్గనైజింగ్ పేకాట నిర్వహిస్తున్నారు. పెద్దగండ్ల బాలు, అతని అనుచరులు వివిధ ప్రాంతాలకు చెందిన జూదరులను పేకాట ఆడేందుకు పిలిపించి వారి నుంచి మేజ్ డబ్బులు వసూలు చేసేవారు. ఈ క్రమంలో నిందితులు ముందస్తు ప్రణాళికతో వ్యవస్థీకృతంగా పేకాట నిర్వహిస్తున్నట్లు సమాచారం రావడంతో వన్టౌన్ సీఐ టీవీ కొండారెడ్డి, ఎస్ఐ మధుసూదన్రెడ్డి సిబ్బందితో కలిసి దాడి చేశారు. దాడిలో ప్రొద్దుటూరులోని ప్రకాష్నగర్కు చెందిన పెద్దగండ్ల బాలు, షేక్ మహబూబ్షరీఫ్, కేకేస్ట్రీట్కు చెందిన సయ్యద్మహమ్మద్ గౌస్, మత్స్యకాలనీకి చెందిన పసుపల శ్రీనివాసులు, అయ్యప్పస్వామి ఆలయం సమీపంలో నివాసం ఉంటున్న మాలేపాటి వెంకటసుబ్బయ్య, మీనాపురం గ్రామానికి చెందిన చింతకుంట రామమోహన్నాయుడు, చూడూరు గ్రామానికి చెందిన మల్లెల నాగేంద్ర, చాపాడు మండలంలోని బద్రిపల్లెకు చెందిన చందా పరమేశ్వరరెడ్డి, యర్రగుంట్ల రోడ్డులోని గడ్డం కేశవలను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 96,520 నగదుతో పాటు 8 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన ఆరుగురు నిందితులపై గతంలో పేకాట కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆర్గనైజింగ్ గ్యాంబ్లింగ్ ముఠాను అరెస్ట్ చేసిన వన్టౌన్ సీఐ, ఎస్ఐ, సిబ్బందిని ఏఎస్పీ అభినందించారు.
9 మంది అరెస్ట్, రూ. 96,520 నగదు,
8 సెల్ఫోన్లు స్వాధీనం


