చిత్రంలో కనిపిస్తున్న నిగనిగలాడే ఆధునిక రైలే ‘వందేభారత్ ఎక్స్ప్రెస్’. జిల్లా రైలు మార్గంలో ఈ వేగవంతమైన రైలు పరుగులు తీస్తుంటే చూసి మురిసిపోవడం స్థానికుల వంతవుతోంది. అయితే, ఇది సామాన్య ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చిన రైలు అనుకుంటే పొరపాటే! కేవలం టెస్టింగ్ కోసం ‘ఒక్క రోజు’ వచ్చి వెళ్లే మురిపెంగానే మిగిలిపోతోంది. రైల్వే అధికారులు కేవలం ఖాళీ కోచ్లతో, సిబ్బందితో కలిసి ఇప్పటివరకు ఐదుసార్లు ఇక్కడ టెస్టింగ్ ట్రిప్పులు నిర్వహించారు. తాజాగా గురువారం నాడు తిరుపతి–సికింద్రాబాద్ మధ్య నడిచే వందేభారత్ రైలును నిర్దేశించిన వేగంతో రేణిగుంట నుంచి నందలూరు వరకు పరుగెత్తించారు. విజయవాడ, చైన్నె రూట్లలో రైళ్ల రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల ప్రయోగాత్మక పరీక్షలకు ఇబ్బందిగా మారుతోంది. అదే సమయంలో రేణిగుంట–కడప మధ్య ట్రాఫిక్ తక్కువగా ఉండటంతో, రైల్వే అధికారులు వందేభారత్ ట్రయల్ రన్స్కు ఈ మార్గాన్ని వేదికగా చేసుకున్నారు. పట్టాలపై దూసుకెళ్తున్న ఈ రైలును చూసి, త్వరలోనే తమకూ వందేభారత్ సేవలు అందుతాయనే ఆశతో స్థానిక ప్రయాణికులు ఎదురుచూస్తున్నారు. రాయలసీమలో అత్యంత కీలకమైన ‘గుత్తి–రేణిగుంట’ రైలు మార్గంలో మాత్రం రెగ్యులర్ సర్వీసును ప్రారంభించకుండా రైల్వేశాఖ ముఖం చాటేయడంపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. – రాజంపేట


