రాజంపేట: రైల్వే పరంగా ఎంతో చారిత్రక ప్రాధాన్యం ఉన్న నందలూరు రైల్వే కేంద్రంలో రోడ్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టమైన హామీ ఇచ్చారని రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి తెలిపారు. ఢిల్లీలోని పార్లమెంట్ భవనంలో రైల్వేమంత్రిని ఆయన స్వయంగా కలిసి నందలూరు అభివృద్ధిపై చర్చించారు. ప్రస్తుతం నందలూరులో ఉన్న ఆర్యూబీ అత్యంత ఇరుకుగా ఉండటం వల్ల బస్సులు, లారీలు, అత్యవసర అంబులెన్స్ వాహనాల రాకపోకలకు నిత్యం ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఎంపీ మంత్రికి వివరించారు ఈ క్రమంలో ఇక్కడ ఆర్వోబీ నిర్మాణం ఎంతో అత్యవసరమని స్పష్టం చేయగా మంత్రి సానుకూలంగా స్పందించారు. అలాగే నందలూరు రైల్వే కేంద్రంలో గతంలో ఉన్న రైళ్లకు వాటరింగ్ సౌకర్యాన్ని పునరుద్ధరించడంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు మేడా రఘునాథరెడ్డి వెల్లడించారు. గుత్తి–రేణిగుంట రైల్వే లైన్ మధ్య ప్రయాణించే అన్ని సుదూర ప్రాంత రైళ్లకు వాటరింగ్ సౌకర్యం కల్పించడానికి నందలూరు కేంద్రం భౌగోళికంగా ఎంతో అనుకూలమన్నారు.
వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసులు
– ఎంపీ, ఎమ్మెల్సీ సహా
వందల మందిపై బనాయింపు
కడప అర్బన్: వైఎస్సార్ కడప జిల్లాలో ఈనెల 10వ తేదీన కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా, డీఎస్సీ అభ్యర్థులను మోసం చేశారని..లోకేష్ రాజీనామా చేయాలంటూ ర్యాలీలను వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ ర్యాలీలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ నేతలపై జిల్లా వ్యాప్తంగా కడప, జమ్మలమడుగు, పులివెందుల, కమలాపురం నియోజక వర్గాలలో పోలీసులు అక్రమ కేసులను బనాయించారు. వైఎస్ఆర్ కడప జిల్లాలో కడప నగరంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ర్యాలీ నిర్వహించారని మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాష, గుంటి నాగేంద్రతో పాటు మరికొంతమందిపై కేసు నమోదు చేశారు. జమ్మలమడుగులో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, ఇంకా 400 మందిపై కేసు నమోదు చేశారు. పులివెందులలో వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షుడు ఇంకా 50 మందిపై కేసు నమోదు చేశారు. కమలాపురం పరిధిలో నరేన్ రామాంజుల రెడ్డితో పాటు మరికొంతమందిపై కేసు నమోదు చేశారు.


