కడప సెవెన్రోడ్స్ : భారత ప్రాచీన సంస్కృతీ,సంప్రదాయాల పరిరక్షణలో ఆదివాసీ ప్రజల పాత్ర, కృషి, ఫలితం ఎంతో ఉందని, ప్రకృతితో మమేకమై మనుగడ సాగించే ఆదివాసుల జీవనశైలి నాగరిక ప్రపంచానికి ఆదర్శనీయమని జిల్లా రెవెన్యూ అధికారి కె. మల్లికార్జునుడు పేర్కొన్నారు. ఆదివారం స్థానిక కలెక్టరేట్లో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుక ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు, జీవన శైలి ప్రకృతితో ముడిపడినవని.. అది వారి జీవన విధానం తప్ప అనాగరికత్వం కాదని గుర్తు చేశారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అణగారిన అన్ని వర్గాల వారు సామాజికంగా, రాజకీయంగా, ఆర్ధికంగా అభివృద్ధి చెందాలనే భవిష్య వ్యూహంతో రాజ్యాంగాన్ని రచించారని పేర్కొన్నారు. అందులో భాగంగానే ఎస్సీ, ఎస్టీ బీసీలకు ప్రత్యేక చట్టా లు, హక్కులను తీసుకువచ్చి వారి అభివద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దోహదపడుతున్నాయన్నారు. జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి బ్రహ్మానంద రెడ్డి, డీఎల్ఎస్ఏ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ డిప్యూటీ చీఫ్ ఎం.చంద్రకాంతమ్మ, శాంతి తదితరులు ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి ముందుగా జిల్లా రెవెన్యూ అధికారి జ్యోతి ప్రజ్వలన చేసి గిరిజన సంక్షేమానికి కృషి చేసిన మహనీయుల చిత్ర పటాలను పుష్పాంజలి ఘటించి సభను ప్రారంభించారు. అనంతరం పలువురు విద్యార్థులు ప్రదర్శించిన బంజారా నృత్య ప్రదర్శనలు, పలు వురు గిరిజన సంఘాల నాయకులు పాడిన పాటలు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి.


