కడప సెవెన్రోడ్స్ : జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమాల అమలులో అన్ని శాఖల ఉద్యోగుల సమన్వయం, అంకితభావం ఎంతో కీలకమని పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అధ్యక్షతన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉద్యోగులు తమకు ఎదురయ్యే ఏ సమస్యనైనా వెంటనే జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ సందర్భంగా వివిధ శాఖలకు సంబంధించిన సమస్యలను ఉద్యోగ సంఘాల ప్రతినిధులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. వినతులను నమోదు చేసుకున్న ఆయన జిల్లా స్థాయిలో పరిష్కరించగల సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశాలను సంబంధిత శాఖలకు పంపించి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగ సంఘాల సమావేశాలు, కార్యక్రమాల నిర్వహణ కోసం కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి స్థలం కేటాయించాలని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు చేసిన విజ్ఞప్తిపై స్పందించారు. కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు. అదేవిధంగా, ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని ప్రతి ఉద్యోగి బాధ్యతగా తీసుకోవాలని కలెక్టర్ కోరారు.
‘స్మార్ట్ కిచెన్’ జిల్లాకు గర్వకారణం
జిల్లాలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో వినూత్నంగా అమలు చేస్తున్న స్మార్ట్ కిచెన్ వ్యవస్థ రాష్ట్రానికే స్ఫూర్తిగా నిలవడం జిల్లాకే గర్వకారణం అని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. గురువారం కలెక్టరేట్ సభాభవనంలో స్మార్ట్ కిచెన్ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకం అమలు తీరు, పురోగతి, వివిధ దశల్లో ఎదురవుతున్న ఇబ్బందులు తదితర అంశాలపై సంబంధిత కమిటీ సభ్యులతో సమగ్ర సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ప్రస్తుతం దశలవారీగా స్మార్ట్ కిచెన్ల విస్తరణ వేగంగా కొనసాగుతోందని కలెక్టర్ తెలిపారు. ప్రతి అధికారి, ప్రతి శాఖ సమన్వయంతో పనిచేసి స్మార్ట్ కిచెన్ వ్యవస్థను జాతీయ స్థాయిలో ఆదర్శంగా నిలపాలని పిలుపునిచ్చారు. సీఎస్పురం మండల మహిళా సంఘాల ప్రతినిధులు, మండల విద్యాశాఖ అధికారులు, ఎంఈవోలు, కిచెన్ మేనేజర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి


