కడప సెవెన్రోడ్స్ : వికసిత భారత్, స్వర్ణాంధ్ర ప్రదేశ్ లక్ష్య సాధనలో భాగంగా.. ‘విజన్ యాక్షన్ ప్లాన్ 2024–29’ మేరకు జిల్లాను ఆర్థికంగా బలోపేతం చేయడంలో భాగస్వామ్యం కావాలని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి బ్యాంక్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి అధ్యక్షతన డిస్ట్రిక్ట్ కన్సల్టెటివ్ కమిటీ (డీసీసీ), డిస్ట్రిక్ట్ లెవెల్ రివ్యూ కమిటీ (డీఎల్ఆర్సీ) బ్యాంకర్స్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలోని అన్ని బ్యాంకులకు నిర్దేశించిన పలురకాల ఋణ లక్ష్యాలు, సాధించిన ప్రగతిని ఆయా బ్యాంకుల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ సమీక్షించారు. కార్యక్రమంలో ముందుగా.. జిల్లా లీడ్ బ్యాంకు చీఫ్ మేనేజర్ జనార్దనం... డిసిసి, డిఎల్ఆర్సి సమావేశం కు సంబంధించిన అజెండా, వివరాలను, పలు శాఖల ద్వారా ప్రభుత్వం అందజేస్తున్న రుణాల ప్రగతిని ఆయా శాఖల అధికారులు కలెక్టర్ కి వివరించారు.
జిల్లా పర్యాటక ప్రాంతాలకు
గుర్తింపును తెస్తాం!
జిల్లాలోని అన్ని పర్యాటక కేంద్రాలకు జాతీయ, ప్రపంచ స్థాయిలో కీర్తిని ప్రతిబింబించేలా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి అభివృద్ధి చేస్తున్నామని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. బుధవా రం కలెక్టరేట్లో జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా టూరిజం కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఉన్న చారిత్రక, పర్యాటక ప్రాశస్త్యం ఉన్న సందర్శనీయ స్థలాలు, క్షేత్రాలను గుర్తించి వారి అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలన్నారు. గండికోట పర్యాటక కేంద్రం అభివృద్ధి పథకంలో భాగంగా చేపట్టే అన్ని రకాల పనులకు సంబంధించి మ్యాపులను, డిజైన్లను పరిశీలించి పలు సూచనలు, సలహాలను అందించారు. పనుల నాణ్యతతో ఎలాంటి రాజీ లేకుండా అన్ని రకాల పర్యటన ప్రాజెక్టులను చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలోని పలు పర్యాటక ప్రాంతాల అభివృద్ధి కోసం టూరిజం కౌన్సిల్ కమిటీ ప్రతిపాదనలు చేయగా జిల్లా కలెక్టర్ ఆయా అంశాలపై సమీక్షించారు. కేఎంసి కమిషనర్ రాకేష్ చంద్ర, జిల్లా టూరిజం అధికారి సురేష్ కుమార్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ ఏడుకొండలు, హౌసింగ్ పీడి రాజారత్నం తదితరులు పాల్గొన్నారు.
రీసర్వే పనులను చురుగ్గా చేపట్టాలి
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న భూ రికార్డుల స్వచ్ఛీకరణ, రీ సర్వే పనులను జిల్లాలో ప్రణాళిక ప్రకారం చురుగ్గా చేపట్టాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. బుధవారం రాష్ట్ర రెవెన్యూ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి సాయిప్రసాద్, రాష్ట్ర భూ పరిపాలనా శాఖ (సీసీఎల్ఏ) ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జయలక్ష్మితో కలిసి భూముల రీ సర్వే ప్రక్రియపై అన్ని జిల్లాల కలెక్టర్లు, జేసీ లతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్షించారు. ఈ కార్యక్రమానికి స్థానిక కలెక్టరేట్ బోర్డు మీటింగ్ హాలు నుంచి కలెక్టర్తోపాటు జేసీ డాక్టర్ నిధి మీనా హాజరయ్యారు. వీసీ ముగిసిన అనంతరం జిల్లాలోని అన్ని మండలాల రెవెన్యూ అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. జిల్లాలో ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్న రీసర్వే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. మ్యూటేషన్ లో భాగంగా సేల్, సబ్ డివిజన్, జాయింట్ ఎల్పిఎం తదితర వ్యక్తిగత వివరాలలో ఎటువంటి తప్పిదాలు లేకుండా పూర్తి చేసి పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అలాగే భూ సమస్యలపై పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్స్ ద్వారా అందే అర్జీలపై సదరు అర్జీ ప్రాథమిక పరిశీలన దశలో ఉన్నట్టు సమాచారం అర్జీదారులకు అందించడం బాధ్యతగా చేపట్టాలన్నారు.


