అసాంఘిక కార్యకలాపాలపై నిరంతర నిఘా
కడప అర్బన్ : అసాంఘిక కార్యకలాపాలైన గ్యాంబ్లింగ్, మట్కా, క్రికెట్ బెట్టింగ్పై నిరంతరం నిఘా ఉంచాలని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశించారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలోని సమావేశపు హాల్లో జమ్మలమడుగు, పులివెందుల సబ్ డివిజన్ పోలీస్ అధికారులతో వేర్వేరుగా నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్కూళ్లు కాలేజీలలో సోషల్ మీడియా వల్ల మహిళలు, బాలికలకు కలిగే వేధింపులపై అవగాహన కల్పించాలన్నారు. మహిళా భద్రతపై గ్రామాలు, కాలనీలు, పాఠశాలలు, కళాశాలల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని ఆదేశించారు. మహిళా సంరక్షణ కార్యదర్శులు (జి.ఎం.ఎస్.కె )ల భాగస్వామ్యంతో గ్రామాలలో మరింత విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. అలాగే, గస్తీని పెంచాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాలు నియంత్రించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించి వాస్తవాలను నిర్ధారించుకుని నిర్ణీత వ్యవధిలోగా చట్టపరిధిలో సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రౌడీ షీటర్లు, ట్రబుల్ మాంగర్లు, గతంలో ఎన్నికల నేరాలకు పాల్పడిన వారి కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచాలని పేర్కొన్నారు. ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించి గ్రామ సభలు, పల్లె నిద్ర, గ్రామాల సందర్శన నిర్వహించాలని చెప్పారు. గంజాయి, డ్రగ్స్ పై ప్రత్యేక కార్యాచరణ రూపొందించి ఉక్కుపాదం మోపాలన్నారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాలు, బహిరంగ మద్యపానం చేసే వారిపై డ్రోన్ కెమెరాల ద్వారా దాడులు నిర్వహించి కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశాల్లో అడిషనల్ ఎస్.పి(అడ్మిన్) కె.ప్రకాష్ బాబు, జమ్మలమడుగు డి.ఎస్.పి కె.వెంకటేశ్వర రావు, పులివెందుల డి.ఎస్.పి మురళి నాయక్, జమ్మలమడుగు, పులివెందుల సబ్ డివిజన్లోని సి.ఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.
అసాంఘిక కార్యకలాపాలపై నిరంతర నిఘా


