● నాలుగు రకాల నమూనా పరీక్షలు...
కడప అగ్రికల్చర్: రైతులకు నాణ్యమైన విత్తనంతోపాటు కల్తీలేని ఎరువులను అందించాలనే లక్ష్యంతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం నియోజవర్గాలవారీగా అగ్రిల్యాబ్లను ఏర్పాటు చేసింది. విత్తనం బాగుంటే పంటలు బాగుంటాయి. పంటలు బాగుంటే నాణ్యమైన దిగుబడులు వస్తాయి. నాణ్యమైన దిగుబడులు వస్తే ధరలు బాగుంటాయి.ఇవన్నీ బాగుంటే రైతు శుభిక్షంగా ఉంటాడు. వీటన్నింటి దృష్టిలో ఉంచుకుని వైఎస్సార్సీపీ ప్రభుత్వం వీటి ఏర్పాటుకు అడుగులు వేసింది. విత్తనాలతోపాటు ఎరువులు, పురుగుమందుల నాణ్యతను కాపాడితే రైతు అన్ని రకాల అభివృద్ధి చెందుతాడనే లక్ష్యంతో వైఎస్సార్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్లను ఏర్పాటు చేసి అన్నదాతకు అండగా నిలిచింది. అలాంటిది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీటిని నిర్విర్యం చేసేందుకు కంకణం కట్టుకోవడంతో రైతులు అందోళన చెందుతున్నారు. ఇప్పటికే నియోజకవర్గాల్లో ల్యాబ్స్ మూతవేసి సేవలకు మంగళం పాడారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వ్యవసాయం పండుగ చేయడమే లక్ష్యంగా...
వ్యవసాయాన్ని పండుగ చేయడమే లక్ష్యంగా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం పలు రకాల పథకాలను చేపట్టింది. ఇందులో భాగంగా దేశంలో తొలిసారిగా ఇంటిగ్రేటెడ్ ల్యాబ్లను ఏర్పాటు చేసింది. రైతులకు నాణ్య మైన విత్తనాలు, ఎరువులు లభించేలా కీలకపాత్ర పోషించాయి. జిల్లాలో ప్రతి నియోజక వర్గానికి ఒకటి చొప్పున రూ. 60 లక్షలతో అగ్రిల్యాబ్ను ఏర్పాటు చేసి రైతులకు సేవలందించింది. ఇందులో భాగంగా మైదుకూరు, ప్రొద్దుటూరు, పులివెందుల, బద్వేల్, కమలాపురం, ముద్దనూరులలో ల్యాబ్స్ను ఏర్పాటు చేసి ఎరువులు, విత్తనాల పరీక్షలను నిర్వహించారు. అలాగే కడపలో రూ.3.60 కోట్లతో డిస్ట్రిక్ట్ ల్యాబ్కు సంబంధించిన నిర్మాణ పనులు చేపట్టింది. అయితే పనులు ఇప్పటికి జరుగుతున్నాయి. జిల్లా ల్యాబ్ ప్రారంభమైతే ఎరువులు, విత్తనాలతోపాటు పరుగుముందులను కూడా పరీక్షించనున్నారు.
ఉచితంగా సేవలు...
రైతులు పంటలు సాగు చేసేమందు తీసుకెళ్లే విత్తనాలను, రసాయనిక ఎరువుల నాణ్యత ప్రమాణాలను ఉచితంగా చెక్ చేసుకునే అవకాశం కల్పించింది. అయితే గత ప్రభుత్వ హాయంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు కనిపించకుండా చేసే కుతంత్రానికి ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం తెరతీసింది. నకిలీలను ఆహ్వానిస్తూ కల్తీలను ప్రోత్సాహిస్తూ ల్యాబ్లను ఒక్కొటికిగా మూసి వేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు చర్చ సాగుసోంది. ఇప్పటికే ఆర్బీకేలను నిర్వర్యం చేసిన సర్కార్ తాజాగా అగ్రిల్యాబ్లను నామరూపాలు లేకుండా చేసేందుకు కుట్ర పన్నుతున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. మొన్నటి వరకు నిర్భయంగా నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల బెడద లేకుండా పంటలను సాగు చేసుకున్న రైతులకు తాజాగా నకిలీల భయం పట్టుకుంది. ఇటీవల సిద్దవటం మండలం వెంకటాయపల్లెలో రైతులు మొక్కజొన్న పంటను సాగుచేశారు. అవి మెలకరాకుండా పోయాయి. దీంతో వారు అందోళన చెందుతున్నారు. అంతకుముందు ఖాజీపేట మండలం ఏటూరులో మినుముపంటను సాగు చేశారు. అవి మెలకొత్తినా దిగుబడి రాకుండా పోయియి. అవి కూడా నకీలీ విత్తనాలు కావడంతో ఇలా జరిగిందని రైతులు వాపోయారు. ఇటీవల కాలంలో జిల్లాలో ఇలాంటి సంఘటనలు చాలా చోటు చేసుకున్నాయి. అయినా పట్టించుకునే వారు కరువయ్యారని రైతులు వాపోతున్నారు.
జిల్లాలో నాలుగు నియోజకవర్గాల్లో...
జిల్లాలోని మైదుకూరు, ముద్దనూరు, కమలాపురం, ప్రొద్దుటూరు అగ్రిల్యాబ్ల్లో పరీక్షలు చేయకుండా ల్యాబ్స్లను మూసివేసినట్లు రైతులు తెలిపారు. వీటిల్లో పనిచేసే సాంకేతిక వ్యవసాయాధికారి, ఏఈఏలను కూడా వేరుచోట పనినిమిత్తం సర్దుబాటు చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం పులివెందుల, బద్వేల్లో ఉండే అగ్రిల్యాబ్స్లో మాత్రం ఎరువులు, విత్తనాల పరీక్షలను నామమాత్రంగా చేస్తున్నట్లు తెలిసింది. వీటిని కూడా త్వరలో మూసివేయనున్నట్లు తెలిసింది.
● జిల్లా కేంద్రంలో సుమారు. 3.60 కోట్లతో నిర్మి స్తున్న ల్యాబ్ పనులు ముక్కుతూ మూలుగుతూ జరుగుతున్నాయి. జిల్లాలో ఆరు అగ్రిల్యాబ్లు ఉంటే నాలుగింటిని మూసి వేశారు. మిగిలిన రెండు చోట్ల అరకొరగా సేవలు అందిస్తున్నారు. కనీసం జిల్లా ల్యాబ్ ప్రారంభమైతే కొంతైనా ప్రయోజనం ఉంటుందని రైతు సంఘనాయకులు, రైతులు అంటున్నారు.
రైతుసంక్షేమమే లక్ష్యంగావైస్సార్సీపీ హయాంలో ఏర్పాటు
చంద్రబాబు ప్రభుత్వంలో నిర్వీర్యం
ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో మూత
మిగిలినవాటిలో నామమాత్రంగా సేవలు
● నాలుగు రకాల నమూనా పరీక్షలు...


