వైఎస్ఆర్ కడప జిల్లాకు కొత్తరూపు
కడప సెవెన్రోడ్స్: జిల్లాల పునర్ వ్వవస్థీకరణలో భాగంగా రాజంపేట రెవెన్యూ డివిజన్లోని నాలుగు మండలాలు వైఎస్సార్ కడపజిల్లాలో చేరాయి. ఇందులో కడప రెవెన్యూ డివిజన్లో కడప, కమలాపురం, వల్లూరు, చెన్నూరు, సీకే దిన్నె, పెండ్లిమర్రి, ఒంటిమిట్ట, సిద్దవటం, ఖాజీపేట ఉన్నాయి. బద్వేలు డివిజన్లో... బద్వేలు, గోపవరం, బి.కోడూరు, పోరుమామిళ్ల, కలసపాడు, కాశినాయన, అట్లూరు, బి.మఠం, మైదుకూరు.... జమ్మలమడుగు డివిజన్లో.. జమ్మలమడుగు, పెద్దముడియం, మైలవరం, ముద్దనూరు, కొండాపురం, ప్రొద్దుటూరు, రాజుపాలెం, ఎర్రగుంట్ల, దువ్వూరు, చాపాడు మండలాలు ఉన్నాయి. పులివెందుల డివిజన్లో... పులివెందుల, సింహాద్రిపురం, లింగాల, తొండూరు, వేముల, వేంపల్లె, చక్రాయపేట, వీఎన్ పల్లె ... రాజంపేట డివిజన్ పరిధిలోకి రాజంపేట, నందలూరు, వీరబల్లి, సుండు
పల్లె మండలాలు వస్తాయి.
● రాజంపేట డివిజన్లోని నాలుగు మండలాలు కలవడంతో వైఎస్సార్ కడపజిల్లా కొత్త రూపు సంతరించుకుంది. జిల్లా భౌగోళిక విస్తీర్ణంతో 12,507 చదరపు కి.మీ.తో రాష్ట్రంలో మొదటిస్థానంలో ఉన్నట్లు అధికారులు తెలియజేస్తున్నా రు. ఇక రెవెన్యూ డివిజన్లు 5, మండలాలు 40, మున్సిపల్ కార్పొరేషన్ 1, మున్సిపాలిటీలు 8, గ్రామ పంచాయతీలు 619, గ్రామ/వార్డు సచివాలయాలు 715 ఉన్నాయి,. ఇందులో గ్రామ సచివాలయాలు 484 కాగా, అర్బన్లో 231 ఉన్నాయి. జన సాంద్రత ఒక చదరపు కిలోమీటరుకు 185 మంది ఉన్నారు. అసెంబ్లీ నియోజకవర్గాలు ఎనిమిది ఉండగా, రెండు పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. కుటుంబాల సంఖ్య 5.63 లక్షలు ఉంది. సెక్స్ రేషియో ప్రతి వెయ్యి మంది పురుషులకు 997 మంది ఉన్నారు. అక్షరాస్యత శాతం 61.69గా ఉంది.
జనాభా లెక్కలు కరెక్టేనా...
జిల్లాల పునర్ వ్వవస్థీకరణ అనంతరం వైఎస్సార్ కడప జిల్లా రాష్ట్రంలోనే రెండో స్థానంలో ఉన్నట్లు కలెక్టర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇంతకుముందు 20,60,054 మంది జిల్లా జనాభా ఉండగా, రాజంపేట నియోజకవర్గంలోని నాలుగు మండలాలు చేరడంతో జనాభా 22,96,497కు చేరుకుని రాష్ట్రంలో రెండవ స్థానంలో ఉన్నట్లు చూపెట్టారు. కానీ, జిల్లాలో పునర్ వ్యవస్థీకరణ తర్వాత తిరుపతి జిల్లా 29,47,547 మంది జనాభాతో తొలిస్థానం, నెల్లూరుజిల్లా 22,99,699 మందితో ద్వితీయ స్థానంలో ఉండగా, వైఎస్సార్ కడపజిల్లా మూడవ స్థానంలో ఉంది. ఈ విషయం జిల్లాల పునర్విభజనతో రెవెన్యూశాఖ విడుదల చేసిన ప్రొవిజనల్ నోటిఫికేషన్లో ఉంది. మరి ఎవరి గణాంకాలు నిజమైనవో అధికారులకే తెలియాలి.


