మదనపల్లెలో కొలువుదీరిన జిల్లా కార్యాలయాలు
సుపరిపాలనతో సమగ్రాభివృద్ధి: కలెక్టర్
మదనపల్లె: రాయచోటిలో ఏర్పాటైన జిల్లా కార్యాలయాలు కొత్త జిల్లా కేంద్రం మదనపల్లెలో కొలువు దీరుతున్నాయి. చేర్పులు, మార్పులతో ఏర్పడిన నూతన అన్నమయ్యజిల్లాకు మదనపల్లెను కేంద్రంగా చేస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో రాయచోటిలోని సుమారు వందకు పైగా ప్రభుత్వ కార్యాలయాలు అక్కడి నుంచి మదనపల్లెకు తరలిరావాల్సి ఉంది. ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు ఇక్కడ కార్యాలయాలను ఏర్పాటు చేసుకుని పాలన సాగించేందుకు చర్యలు చేపట్టారు. తొలిరోజు 27 ప్రభుత్వ శాఖల కార్యాలయాలు కొలువుదీరాయి. ప్రధానంగా జిల్లా ఎస్పీ కార్యాలయం రేస్ కళాశాలలో సిద్ధమవుతోంది. దీన్ని ఎస్పీ ధీరణ్, పోలీసు ఉన్నతాధికారులు పరిశీలించారు. ఇప్పటి కలెక్టరేట్లో నడిచిన సబ్కలెక్టర్ కార్యాలయాన్ని పుంగనూరు రోడ్డులోని డీడీఓ భవనంలోకి మార్చారు. గురువారం ఈ కార్యాలయంలో సబ్కలెక్టర్ చల్లా కళ్యాణి పూజలు నిర్వహించి పాలన ప్రారంభించారు. మదనపల్లెకు వచ్చిన ఎస్పీ ధీరజ్ కుటుంబ సమేతంగా స్థానిక ప్రసన్న వెంకటరమణస్వామి ఆలయానికి వెళ్లి స్వామి వారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. తొలిరోజు గురువారం మదనపల్లెలో ఏర్పాటైన జిల్లా కార్యాలయాలు వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక బీటీ కళాశాలలో జిల్లా నీటి యాజమాన్య సంస్థ, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, జిల్లా పంచాయతీ అధికారి, ముఖ్య ప్రణాళిక అధికారి, ఖాజానా శాఖ, జెడ్పీ హైస్కూల్లో జిల్లా విద్యాశాఖ, సమగ్ర శిక్ష ఏపీసీ కార్యాలయం, ఇంటిగ్రేటెడ్ క్యాంపస్లో జిల్లా ఆడిట్, మెప్మా, పౌరసరఫరాలు, భూగర్భ జలవనరులు, సమాచార, పౌర సంబంధాలశాఖ, జీడబ్ల్యూఎస్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్, ఖాదీ–విలేజ్ డెవలప్మెంట్, దేవదాయ–ధర్మాదాయ, జిల్లా రిజిస్ట్రార్, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్, బెంగళూరు రోడ్డులోని పట్టుపరిశ్రమ భవనాల ప్రాంగణంలో ఏర్పాటు చేశారు.
రేస్లో ఎస్పీ, డీడీఓలో సబ్కలెక్టర్
మొదటిరోజు 27 శాఖల కార్యకలాపాలు


