
24 నుంచి ఒంటిమిట్టలో పవిత్రోత్సవాలు
ఒంటిమిట్ట: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో పవిత్రోత్సవాలు ఈనెల 24 నుంచి 26వ తేదీ వరకు జరుగుతాయని టీడీడీ అధికారులు బుధవారం తెలిపారు. ఇందుకోసం ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. ఆగస్టు 23వ తేది సాయంత్రం ఆరు గంటలకు అంకుకార్పణతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయన్నారు.సంప్రదాయం ప్రకారం జాతశౌచం, మృతశౌచం వంటి వేళల్లో ఆలయ ప్రవేశం నిషిద్ధమని, అయినా యాత్రికుల వల్ల, సిబ్బంది వల్ల తెలియక దోషాలు జరుగుతుంటాయని, ఇలాంటి వాటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాది మూడు రోజులపాటు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ అని తెలిపారు. ఇందులో భాగంగా ఆగస్టు 24న ఉదయం చతుష్టానార్చన, పవిత్ర ప్రతిష్ట, సాయంత్రం పవిత్రహోమం, నివేదన, శాత్తుమొర జరగుతాయన్నారు. 25న ఉదయం పవిత్ర సమర్పణ, సాయంత్రం యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారన్నారు. 26న ఉదయం మహాపూర్ణాహుతి, పవిత్ర విసర్జన, కుంభప్రోక్ష, సాయంత్రం శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి ఉత్సవర్ల ఊరేగింపు జరుగుతుందని టీటీడీ అధికారులు తెలిపారు.