
వైఎస్సార్ ఓ ఎమోషన్
పులివెందుల: ఈ ప్రాంత ప్రజలకు వైఎస్సార్ ఒక ఎమోషన్ అని.. ఆయన విగ్రహాలకు టీడీపీ జెండాలు కట్టి రెచ్చగొట్టడం సరికాదని ఎంపీ అవినాష్ రెడ్డి అన్నారు. తెలుగుదేశం పార్టీ కవ్వింపు చర్యలపై బుధవారం ఆయన భాకరాపురంలోని వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో జరుగుతున్న మహానాడుపై రాష్ట్ర ప్రజలు ఎంతో ఆశ పెట్టుకున్నారన్నారు. ముఖ్యంగా రాయలసీమ వాసులు ఈ ప్రాంత అభివృద్ధి గురించి సీఎం ప్రస్తావిస్తారని ఎదురు చూశారు, కానీ మహానాడులో వాటి గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదని మండిపడ్డారు. ఈ రెండు రోజుల మహానాడు తీరు ఒక్కసారి చూస్తే ఆత్మస్తుతి, పరనింద, ఇంతకు మించి ఏమైనా కనిపించిందా అని ప్రశ్నించారు. కేవలం వందల కోట్ల రూపాయలు వ్యయం చేసి భారీ సెట్టింగ్లు వేసి మహానాడు పేరుతో కడప గడ్డకు వచ్చి జగన్మోహన్రెడ్డిని తిట్టారన్న పైశాచిక ఆనందం కోసం వందల కోట్లు వెచ్చించారని ధ్వజమెత్తారు. ఎన్నికలలో మీరు ఇచ్చిన హామీలు ఏమిటో అందరికి తెలుసు అన్నారు. 18ఏళ్లు దాటిన ప్రతి మహిళకు రూ.18వేలు పథకాన్ని హ్యాండ్ ఇచ్చారు.. ఉచిత బస్సు, తల్లికి వందనం, రూ.20వేలు రైతు భరోసా, 50ఏళ్లకే పింఛన్, 20లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి ఇవన్నీ గాలికొదిలేసి ప్రజలకు మోసం చేశారు. సంవత్సరం రోజులలో ఇది టీడీపీ ట్రాక్ రికార్డు అని తూర్పారబట్టారు. ఈ సారి ఎన్నికలు వస్తే మీ స్థానం కాదు కాదా ఏ ఒక్క స్థానం తెలుగుదేశం పార్టీ చేతికి చిక్కదని, అటువంటి దయనీయమైన స్థితిలో తెలుగుదేశం పార్టీ ఉందని, సంవత్సరం రోజులకే ప్రజల నమ్మకాన్ని కోల్పోయారన్నారు. టైం వచ్చినప్పుడు ప్రజలు మీకు బలమైన దెబ్బకొడతారనే విషయాన్ని తెలుగుదేశం పార్టీ నేతలు తెలుసుకోవాలన్నారు.
మహానాడు సందర్భంగా సభ్యత మరిచిపోయి, మనుషులమని మరిచిపోయి పులివెందులలో రాజశేఖరరెడ్డి విగ్రహాల చుట్టూ జెండాలు పెట్టడం, తెలుగుదేశం పార్టీ తోరణాలు కట్టడం దారుణమన్నారు. ప్రజలు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తల మనోభావాలు దెబ్బతింటున్నాయని.. వాటిని తొలగించాలని అధికారులను కోరగా పట్టించుకోలేదన్నారు. ఇవాళ ఉదయం కొంతమంది తమ పార్టీ నాయకులు, కార్యకర్తలు వెళ్లి వాటిని తొలగించారన్నారు. దీనికి బీటెక్ రవి మాట్లాడుతూ టీడీపీ తోరణాలను, జెండాలను వైఎస్సార్సీపీ నాయకులు తొక్కారని అవాస్తవాలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. వైఎస్ రాజశేఖరరెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే కాదు, ఈ ప్రాంత ప్రజల గుండెల్లో ఒక ఎమోషన్.. ఆయన్ను అగౌరవపరిస్తే మీ పార్టీకి చెందిన జెండాలు, తోరణాలు కడితే ఏ ఒక్కరు సహించక రెస్పాండ్ అయ్యి తీసేశారన్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించాలని కోరారు. ఈ 11నెలల్లో టీడీపీ నేతలు ప్రతి రోజు, ప్రతి గంట, ప్రతి సెకండు పోలీసులను అడ్డుపెట్టుకుని దద్దమ్మ రాజకీయాలు చేశారు, ఒక సెకండు పోలీసులను పక్కనపెట్టి వస్తే మీ పరిస్థితి ఏమిటో ఆలోచించుకోవాలన్నారు. ఈరోజు తాము సహనంగా ఉన్నామనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. కార్యకర్తలు కూడా సంయమనంగా ఉండాలని ఎంపీ కోరారు. టీడీపీ నేతల కవ్వింపు చర్యలకు, రెచ్చగొట్టే మాటలకు ఏ ఒక్కరు రెచ్చిపోవద్దని సూచించారు. గత ఐదేళ్లలో తాము ఎన్టీఆర్ను ఎప్పుడు అగౌరవపరచలేదు, పైగా ఒక జిల్లాకే ఎన్టీఆర్ పేరు పెట్టామన్నారు. విష సంస్కృతికి బీజం వేయొద్దని టీడీపీ నేతలకు సూచించారు.
తెలుగుదేశం పార్టీ వైఎస్సార్ను అగౌరవపరుస్తున్నారు
వైఎస్సార్ విగ్రహాలకు పచ్చ జెండాలు కట్టడం సరికాదు
సంయమన రాజకీయాలు చేస్తున్నాం
రెచ్చగొట్టే చర్యలు మానుకోవాలి
టీడీపీ మహానాడు ఆత్మస్తుతి, పరనింద
మీడియాతో కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి