
చుక్కల జింకను కాపాడిన అటవీ సిబ్బంది
చింతకొమ్మదిన్నె : చింతకొమ్మదిన్నె మండలం మామిళ్లపల్లె ఫారెస్ట్ బీటు కొన్నేపల్లి గ్రామ పరిధిలో రెండేళ్ల వయస్సు గల ఒక మగ చుక్కల జింకను కుక్కలు తరుముకోవడంతో ప్రమాదవశాత్తు 100 అడుగుల లోతు గల బావిలో పడింది. బావిలో అట్టడుగున నీరు ఉండటంతో చిన్నపాటి గాయాలయ్యాయి. గ్రామస్థుల ద్వారా సమాచారం అందుకున్న వెంటనే కడప ఫారెస్ట్ డిప్యూటీ రేంజర్ ఓబులేసు మామిళ్లపల్లి సెక్షన్ సిబ్బందితో కలిసి గ్రామస్తుల సాయంతో రెస్క్యూ ఆపరేషన్ చేసి జింకను ప్రాణాలతో కాపాడారు. జిల్లా వెటర్నరీ ఆసుపత్రిలో చికిత్స చేయించి రిజర్వ్ ఫారెస్ట్లో సురక్షితంగా వదిలి వేశారు.
ఆటో బోల్తా
15 మంది కూలీలకు గాయాలు
బ్రహ్మంగారిమఠం : మండలంలోని దిరసవంచ పంచాయతీ రాజుపేట దగ్గర ఆదివారం సాయంత్రం కూలీలతో వెళుతున్న ఆటో బోల్తా పడడంతో 15 మంది కూలీలకు గాయాలయ్యాయి. వివరాలు ఇలా.. నందిపల్లె దగ్గర మిరప పంటలో పనుల కోసం నాగిశెట్టిపల్లె, రాజుపేట, పెద్దిరాజుపల్లెకు చెంది మహిళలు వెళ్లారు. పనులకు తీసుకెళ్లిన ఆటో టైరు పంచర్ కావడంతో రాజుపేటకు చెందిన మరో ఆటోలో కూలీలు ఎక్కి వస్తుండగా రాజుపేట సమీపంలోని కాశినాయన ఆశ్రమం సమీపంలోని మలుపులో ఆటో బోల్తా పడింది. దీంతో కూలీలకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని బద్వేలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలైన వారిని కడపకు తరలించారు. వీరిలో కె.సుభద్రమ్మ, కె.సరోజమ్మ, ఎం.ఇంద్రమ్మల పరిస్థితి విషమంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఇరువర్గాలపై కేసులు నమోదు
మదనపల్లె : భూమి వివాదంలో భాగంగా గొడవ పడిన ఇరువర్గాలపై కేసులు నమోదు చేసినట్లు తాలూకా సీఐ కళా వెంకటరమణ తెలిపారు. మండలంలోని వేంపల్లి పంచాయతీలోని సర్వే నంబర్ 221లో గల 2.5 ఎకరాల భూమి విషయమై బార్లపల్లెకు చెందిన షేక్ మస్తాన్, అతని కుటుంబ సభ్యులు, మరో ముగ్గురు కలిసి మదనపల్లె పట్టణం నక్కలదిన్నె మారెమ్మగుడి వద్ద ఉన్న నికలేష్తో పాటు ముగ్గురితో భూమి విషయమై ఆదివారం దాడులకు పాల్పడ్డారు. స్థానికులు సమాచారాన్ని తాలూకా పోలీసులకు తెలపడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న తాలూకా పోలీసులు ఇరు వర్గాలపై కేసులు నమోదు చేశారు.

చుక్కల జింకను కాపాడిన అటవీ సిబ్బంది