బీటీ.. భవిష్యత్తు ఏంటి?
రూ.5 కోట్లతో అభివృద్ధి
మదనపల్లె: అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లెలోని బిసెంట్ థియోసాఫికల్ కళాశాల (బీటీ కళాశాల) ఒక చరిత్రాత్మక విద్యా సంస్థ. 1915లో ఐరిష్ వనిత అన్నీబిసెంట్ స్థాపించిన ఈ కళాశాల దేశ స్వాతంత్ర పోరాటంలో జాతీయవిద్యకు కేంద్రమైంది. రాయలసీమలో తొలి కళాశాల, లక్షల మంది విద్యార్థులకు విద్యా దీపమై వెలిగి, స్వాతంత్య్ర ఉద్యమానికి కేంద్రంగా పోరుబాట నడిపించింది. తొలి తరం నుంచి మొన్నటి తరం వరకు ఇక్కడ చదువుకున్న విద్యార్థుల్లో మాజీ సీఎం కోట్ల విజయభాస్కర్రెడ్డి, మాజీ గవర్నర్ పెండేకంటి వెంకటసుబ్బయ్య లాంటి ఉన్నతస్థానాలకు ఎదిగినవారు, ఎందరో మంత్రులు, ఎమ్మెల్యేలు, విద్యావేత్తలు, పారిశ్రామిక, శాస్త్రవేత్తలు.. ఇలా అన్నిరంగాల్లో మేధావులను అందించిన బీటీ కళాశాల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఏటా 5వేల మందికిపైగా విద్యార్థులతో కళకళలాడిన కళాశాలను ఇప్పుడు పట్టించుకునే దిక్కులేకుండా పోయింది. వందల కోట్ల విలువైన ఆస్తులు కలిగిన ఈ కళాశాలకు మళ్లీ పూర్వవైభవం తేవాలని, జిల్లాకు విశ్వవిద్యాలయం అందించాలన్న ఆశయంతో ఎంపీ పీవీ మిథున్రెడ్డి చేసిన కృషి, వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలను కూటమి ప్రభుత్వం రాగానే నీరుగార్చింది. కళాశాల స్థితిగతులను గాలికి వదిలేసింది. ప్రస్తుతం కేవలం 154 మంది విద్యార్థులతో కళాశాల దీనంగా నడుస్తోంది.
మిథున్రెడ్డి కృషితో..
ఎయిడెడ్ బీటీ కళాశాలను ప్రభుత్వంలో విలీనం చేసి నడపాలన్న డిమాండ్తో ఉద్యమాలు జరిగాయి. స్పందించిన ఎంపీ పీవీ మిథున్రెడ్డి ఈ విషయమై విద్యావేత్తలు, మేధావులతో సమీక్షించి.. చర్చలు జరిపి వారి అభిప్రాయాలు, సూచనలు తీసుకున్నారు. కళాశాలను ప్రభుత్వ ఆధ్వర్యంలో నడపడం సముచితమన్న నిర్ణయానికి వచ్చి బీటీ కళాశాల ట్రస్టీలతో చర్చించాక వారు సుముఖత వ్యక్తం చేశారు. దాంతో డిగ్రీ కళాశాలను, దానికి సంబంధించిన ఆస్తులు, వగైరాలు ప్రభుత్వానికి అప్పగించడంతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటూ 2022 ఆగస్టు, 16న జీవో జారీ చేసింది. తర్వాత అన్నయ్యజిల్లాకు విశ్వవిద్యాలయం లేకపోవడంతో ఎంపీ పీవీ మిథున్రెడ్డి కృషితో ప్రభుత్వం 2024 ఫిబ్రవరి, 9న అన్నీబిసెంట్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తూ జీవో జారీ చేసింది. ఈ జీవోలోనే మిథున్రెడ్డి సిఫార్సు మేరకు అని స్పష్టంగా పేర్కొన్నారు.
విలువైన ఆస్తులు సమకూర్చి..
వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అన్నీబిసెంట్ యూనివర్సిటీ ఏర్పాటుకు జీవో జారీ చేయకముందే బీటీ కళాశాల ట్రస్ట్ నుంచి సుమారు రూ.150 కోట్ల విలువైన ఆస్తులను ప్రభుత్వానికి చెందేలా చేసింది. కళాశాల ట్రస్ట్కు 47.36 ఎకరాలు ఉండగా, అందులో 11.86 ఎకరాలను ప్రభుత్వానికి, కళాశాలను అప్పగించారు. దాంతో విశ్వవిద్యాలయం చేసేందుకు కూటమి ప్రభుత్వానికి ఎలాంటి సమస్య ఎదురు కాలేదు. కావాల్సినన్ని భవనాలు, భూమి అందుబాటులోకి వచ్చాయి.
వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో బీటీ కళాశాల అభివృద్దికి రూ.5 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులతో ఇప్పటికీ పనులు కొనసాగుతున్నాయి. ఇందులో రూ.4 కోట్లతో కళాశాల భవనాల పైకప్పు దెబ్బతినడంతో వాటిని తొలగించి కొత్తగా శ్లాబులు, లైటింగ్, లైబ్రరీ ఎదుట మైదానంలో ఒక భవన నిర్మాణం జరుగుతోంది. మిగిలిన ఒక కోటి నిధులతో కళాశాలకు 70 కంప్యూటర్లు, డిజిటల్ బోర్డులు, పోడియం తదితర సౌకర్యాలను కల్పించారు.
వైఎస్సార్సీపీ హయాంలోబీటీ కళాశాలకు యూనివర్సిటీగా గుర్తింపు
అభివృద్ధి పనులకురూ.5 కోట్లు మంజూరు
కూటమి పాలకుల నిర్లక్ష్యంతోఒక్క అడుగు ముందుకు పడలేదు
ఇప్పుడు జిల్లా కార్యాలయాలకువినియోగంపై ఆందోళన
ఎంతో ఖ్యాతి కలిగిన కళాశాలమనుగడపై నీలినీడలు


