
గుర్తు తెలియని వృద్ధుడి మృతి
వేంపల్లె : స్థానిక నాలు గు రోడ్ల కూడలిలోని జీవాల మార్కెట్ సందులో గుర్తుతెలియని వృద్ధుడు మృతి చెందాడు. ఉదయం నుంచి తోపుడు బండిపై పడి ఉండటాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. మృతదేహాన్ని వేంపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
మద్యం తాగి వాహనం
నడిపినందుకు జరిమానా
బద్వేలు అర్బన్ : రోడ్డు ప్రమాద నియంత్రణలో భాగంగా పట్టణ పోలీసులు డ్రంకెన్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్ తనిఖీలు విస్తృతం చేశారు. ఇందులో భాగంగా ఇటీవల కాలంలో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న ఐదుగురిని అర్బన్ పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం వారిని బద్వేలు అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి ముకేష్కుమార్ ఒక్కొక్కరికి రూ.10 వేలు చొప్పున జరిమానా విధించారు. ఈ సందర్భంగా అర్బన్ సీఐ ఎం.రాజగోపాల్ మాట్లాడుతూ డ్రంకెన్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్పై నిరంతరం తనిఖీలు కొనసాగుతాయని, ఎవరైనా మద్యం సేవించి వాహనాలు నడిపితే కేసులు నమోదు చేసి కోర్టు ఎదుట హాజరు పరుస్తామని తెలిపారు.
వంద బియ్యం బస్తాలు పట్టివేత
ఎర్రగుంట్ల(జమ్మలమడుగు) : ఎర్రగుంట్ల పట్టణంలోని రాణివనం కాలనీలో ఓ గదిలో నిల్వ ఉంచిన 100 ప్రభుత్వ బియ్యం బస్తాలను పట్టుకున్నట్లు కడప విజిలెన్స్ శాఖ సీఐ శివన్న తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు ఎర్రగుంట్ల పట్టణంలో పలు చోట్ల బియ్యాన్ని కిలో రూ.18లకు కొనుగోలు చేసి వాటిని రాణివనంలోని ఒక గదిని అద్దెకు తీసుకుని అందులో భద్రపరిచారన్నారు. తమకు అందిన సమాచారం మేరకు దాడి చేసి నిల్వ ఉంచిన 100 ప్రభుత్వ బియ్యం బస్తాలను స్వాధీనం చేసుకుని వీరకుమార్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేశామన్నారు. పట్టుకున్న బియ్యం బస్తాలను సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ గోవింద్కు అప్పగించామన్నారు. ఈ దాడిలో విజిలెన్స్ అధికారులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

గుర్తు తెలియని వృద్ధుడి మృతి