సాక్షి యాదాద్రి : హైదరాబాద్–కాజీపేట ప్రధాన రైల్వే మార్గంలో విపరీతమైన రద్దీని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఘట్కేసర్ నుంచి కాజీపేట మధ్య 110 కిలోమీటర్ల మేర రూ.2,419 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్న మల్టీట్రాకింగ్ (నాలుగో లైన్) ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. 2029–30 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ఈ ప్రాజెక్టుతో హైదరాబాద్–వరంగల్ కారిడార్లో రైళ్ల క్రాసింగ్, నిరీక్షణ తప్పుతుంది. ప్యాసింజర్లు, ఉద్యోగులు, విద్యార్థులు, యాదాద్రి భక్తులకు ప్రయాణం మరింత సులభతరం కానుంది.
అందుబాటులోకి వస్తే..
హైదరాబాద్, వరంగల్–కాజీపేట ప్రాంతాల మధ్య యాదాద్రి భువనగిరి జిల్లా కీలక అనుసంధానకర్తగా ఉంది. బీబీనగర్, భువనగిరి, యాదగిరిగుట్ట, ఆలేరు పరిసర ప్రాంతాల నుంచి రోజూ వేలాది మంది ఉద్యోగ, వ్యాపార, విద్యా, వైద్య అవసరాల కోసం హైదరాబాద్, వరంగల్ వైపు రాకపోకలు సాగిస్తుంటారు. ప్రస్తుతం ఉన్న మార్గంలో విపరీతమైన రద్దీ కారణంగా ప్యాసింజర్ రైళ్లను క్రాసింగ్ కోసం గంటల తరబడి నిలిపివేస్తున్నారు. నాలుగో లైన్ అందుబాటులోకి వస్తే ఈ నిరీక్షణలు తగ్గి రైళ్ల వేగం, సమయపాలన మెరుగవుతాయి.
యాదగిరిగుట్ట
భక్తులకు మరింత సౌకర్యం
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్టకు తెలంగాణతో పాటు దేశ నలుమూలల నుంచి నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. ఈ మార్గంలో ట్రాక్ సామర్థ్యం పెరిగితే భక్తుల కోసం ప్రత్యేక రైళ్లు, అదనపు సర్వీసులు కేటాయించే వెసులుబాటు కలుగుతుంది. ముఖ్యంగా పండుగలు, బ్రహ్మోత్సవాలు, వరుస సెలవుల రోజుల్లో పెరిగే రద్దీని సులువుగా నిర్వహించవచ్చు. ప్రస్తుతం ఘట్కేసర్ నుంచి వంగపల్లి వరకు ఎంఎంటీఎస్ పొడిగింపు పనులు పురోగతిలో ఉండగా, తాజాగా నాలుగో లైన్ కూడా తోడైతే ఈ కారిడార్లో రైల్వే రద్దీ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది.
పారిశ్రామిక రంగానికి ఊతం
జిల్లాలో వేగంగా విస్తరిస్తున్న పారిశ్రామిక, వాణిజ్య కార్యకలాపాలకు ఈ నాలుగో లైన్ ఊతమివ్వనుంది. అదనపు ట్రాక్ అందుబాటులోకి రావడం వల్ల సిమెంట్, ఉక్కు, బొగ్గు, ఎరువులు, ఆహార ధాన్యాలు, పెట్రోలియం ఉత్పత్తుల సరుకు రవాణా వేగవంతం కానుంది. ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు లాజిస్టిక్స్, వేర్హౌసింగ్ రంగాలు మరింత అభివృద్ధి చెందుతాయి.
ఫ రూ.2,419 కోట్లతో ఏర్పాటు
ఫ యాదాద్రి భువనగిరి జిల్లా మీదుగా కీలక విస్తరణ
ఫ క్రాసింగ్ కష్టాలు, నిరీక్షణకు తెర
ఫ ‘గుట్ట’ భక్తులకు మరింత
సులభంగా రైలు ప్రయాణం
రైల్వే ప్రాజెక్టు ముఖచిత్రం
ప్రాజెక్టు పేరు ఘట్కేసర్–కాజీపేట
నాలుగో లైన్ (మల్టీట్రాకింగ్)
మొత్తం పొడవు 110 కిలోమీటర్లు
అంచనా వ్యయంరూ. 2,419 కోట్లు
కావాల్సిన భూమి 124 హెక్టార్లు
కాలపరిమితి 2029-30 నాటికి


