మేళ్లచెరువు : చేపల వేటకు వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు. ఈ ఘటన మేళ్లచెరువు కేంద్రంలోని ఎన్ఎస్పీ ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ వద్ద మంగళవారం సాయంత్రం జరిగింది. బుధవారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణానికి చెందిన బోగం ఏసుబాబు (30) రెండు రోజుల క్రితం మేళ్లచెరువు మండల కేంద్రంలోని బంధువుల ఇంటికి వచ్చాడు. ఏసుబాబుతో పాటు అతడి బంధువులైన ఏడుకొండలు, ప్రవీణ్ కలిసి మంగళవారం సాయంత్రం మేళ్లచెరువు మండల కేంద్రం పరిధిలోని ఎన్ఎస్పీ ముక్త్యాల బ్రాంచ్ కాలువలో చేపలు పట్టడానికి వెళ్లారు. ఈ క్రమంలో ఏసుబాబు వల విసరగా, అది నీటిలో ఎక్కడో చిక్కుకుంది. ఆ వలను బయటికి తీసేందుకు ఏసుబాబు కాలువలోకి దిగాడు. ఆ సమయంలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో ఆయన కాలుజారి నీటిలో మునిగి మృతి చెందాడు. బుధవారం మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నవీన్కుమార్ తెలిపారు.
రైలు కింద పడి దుర్మరణం
మిర్యాలగూడ : విష్ణుపురం–కొండ్రపోల్ రైల్వేస్టేషన్ల మధ్య బుధవారం సాయంత్రం సుమారు 50 నుంచి 55 సంవత్సరాల వయస్సు కలిగిన గుర్తుతెలియని వ్యక్తి రైలు కింద పడి మృతిచెందాడు. మృతుడు పచ్చ రంగు చొక్కా, నలుపు రంగు ప్యాంట్ ధరించి ఉన్నాడని రైల్వే ఎస్ఐ రామకృష్ణ అన్నారు. నల్లగొండ రైల్వే స్టేషన్ మాస్టర్ అభినవ్కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతుడి వివరాలు తెలిసినవారు 87126 58595, 87125 13805 నంబర్లకు సమాచారం అందించాలని సూచించారు.


