సూర్యాపేట టౌన్ : కోదాడ పట్టణంలో తాళాలు వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగను కోదాడ పట్టణ, సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సూర్యాపేట ఎస్పీ కె. నరసింహ బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. హైదరాబాద్లోని జగద్గిరిగుట్టకు చెందిన పట్నంశెట్టి రాజు అలియాస్ రాజిరెడ్డి కారు డ్రైవర్గా పనిచేస్తూ, సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో దొంగతనాల బాటపట్టాడు. 2021 నుంచి కోదాడలో మొత్తం 10 ఇళ్లలో చోరీలు చేయగా, ఈ ఏడాదిలోనే ఏడు ఇళ్లలో దొంగతనాలు చేశాడు. హైదరాబాద్ నుంచి ప్రయాణికులను కోదాడకు తీసుకొచ్చిన అనంతరం రాత్రి వేళ అక్కడే ఉండి, కారును నిర్మానుష్య ప్రాంతంలో పార్కింగ్ చేసేవాడు. తెల్లవారుజామున తాళాలు వేసి ఉన్న ఇళ్లను గుర్తించి, స్క్రూడ్రైవర్తో తాళాలు పగులగొట్టి బంగారం, వెండి, నగదును అపహరించేవాడు. పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు తన కారు అసలు నంబర్కు బదులుగా నకిలీ నంబర్ ప్లేట్ను ఉపయోగించేవాడు. బుధవారం ఉదయం కోదాడ పట్టణంలో చేపట్టిన పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా.. పోలీసులను చూసి తప్పించుకునేందుకు ప్రయత్నించిన రాజిరెడ్డిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. నిందితుడి కారును తనిఖీ చేయగా 37.2 తులాల బంగారం, 470 గ్రాముల వెండి, రూ.3.60 లక్షల నగదు లభించిందన్నారు. వాటి విలువ సుమారు రూ.60 లక్షలు ఉంటుందని తెలిపారు. దొంగతనాలకు ఉపయోగించిన స్క్రూడ్రైవర్లు, షూ సాక్స్లు, కారు, సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. దొంగిలించిన ఆభరణాల్లో కొన్నింటిని విక్రయించగా, మరికొన్నింటిని కరిగించారని, ఇంకొన్నింటిని ఫైనాన్స్ సంస్థల్లో కుదవపెట్టి వచ్చిన డబ్బును వ్యక్తిగత అవసరాలకు ఉపయోగించినట్లు అదేవిధంగా అప్పుల చెల్లింపులకు వినియోగించినట్లు తమ విచారణలో తేలిందని తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్పీ పేర్కొన్నారు.
ఫ రూ.60 లక్షల విలువైన
సొత్తు స్వాధీనం
ఫ వివరాలు వెల్లడించిన
సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ


