నాగారం : పాత కక్షలు, భూ తగాదాల నేపథ్యంలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన నాగారం మండలం డి.కొత్తపల్లి గ్రామంలో బుధవారం సాయంత్రం జరిగింది. స్థానికులు, మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. డి.కొత్తపల్లి గ్రామానికి బయ్యం యాకస్వామి (43), బయ్యం నవీన్ వరుసకు చిన్నాన్న, పెద్దనాన్న కొడుకులు. గతంలో వీరి తండ్రులైన బయ్యం భిక్షం, బయ్యం అర్వపల్లి మధ్య భూ పంపకాల సమయంలో అవకతవకలు జరిగానే నెపంతో ఇరు కుటుంబాలు తరచూ గొడవలు పడుతుండేవారు. మంగళవారం బయ్యం యాకస్వామి తన గొర్రెలను వివాదంలో ఉన్న భూమిలో మేపుతుండగా బయ్యం నవీన్ తల్లి ధనమ్మ గమనించడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. బుధవారం కూడా యాకస్వామి తన గొర్రెలను వివాదాస్పద భూమిలో మేపుతుండగా.. మరోసారి ఇరు కుటుంబాలు ఘర్షణకు దిగారు. ఈ క్రమంలో బయ్యం యాకస్వామి.. నవీన్ తల్లిని తిట్టడంతో కోపోద్రిక్తుడైన నవీన్ తన దగ్గర ఉన్న గొడ్డలి తీసుకొని యాకస్వామి తలపై బలంగా కొట్టడంతో తలకు బలమైన గాయమై అక్కడే కుప్పకూలాడు. నవీన్ భయంతో అక్కడి నుంచి పారిపోయాడు. చుట్టుపక్కల వారు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని యాకస్వామిని చికిత్స నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చిరంజీవి తెలిపారు.


