ఆలేరురూరల్ : బైక్పై వెళ్తున్న ఇద్దరు యువకులను గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో మృతిచెందారు. ఈ ఘటన హైదరాబాద్–వరంగల్ జాతీయ రహదారిపై ఆలేరు పట్టణ శివారులో బుధవారం తెల్లవారుజామున జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం రాగిబావి గ్రామానికి చెందిన రాంపాక శ్రీధర్(23) హైదరాబాద్లోని నేరేడ్మెట్లో హాస్టల్లో ఉంటూ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్కు చెందిన కలకోటి నివాస్(22) కూడా పెయింటింగ్ పనిచేస్తూ అదే హాస్టల్లో ఉంటున్నాడు. శ్రీధర్, నివాస్ స్నేహితులు. వారిద్దరు బుధవారం తెల్లవారుజామున హైదరాబాద్ నుంచి స్టేషన్ ఘనపూర్కు బైక్పై వెళ్తుండగా.. మార్గమధ్యలో హైదరాబాద్–వరంగల్ జాతీయ రహదారిపై ఆలేరు పట్టణ శివారులోని భాను మెస్ సమీపంలోకి రాగానే గుర్తుతెలియని వాహనం బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీధర్, నివాస్ అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇద్దరి మృతదేహాల్ని ఆలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడు శ్రీధర్ తండి పాపయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్హెచ్ఓ ఉదయ్కిరణ్ తెలిపారు.
ఫ ఇద్దరు యువకులు దుర్మరణం


