భువనగిరిటౌన్ : జిల్లాలోని అన్ని కోర్టుల్లో ఈ నెల 12న శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయసేవా అధికార సంస్థ కార్యదర్శి వి.మాధవీలత తెలిపారు. లోక్ అదాలత్ ఏర్పాట్లపై బుధవారం ఆమె పోలీస్ అధికారులు, న్యాయవాదులతో ఆమె సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల ఎస్హెచ్ఓలు, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ హనుమంతుతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. భువనగిరి బార్ అసోసియేషన్లో సభ్యులతో సమావేశమయ్యారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్.విద్యాసాగర్, న్యాయవాదులు పాల్గొన్నారు.
15 వరకు ఓపెన్ స్కూల్ దరఖాస్తుల గడువు
భువనగిరి : ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా పదో తరగతి, ఇంటర్మీడియట్ చదివేందుకు 2026–27 విద్యా సంవత్సరానికి ఎటువంటి అపరాద రుసుము లేకుండా ఈ నెల 15వ తేదీ వరకు గడువు ఉందని తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ రాష్ట్ర కోఆర్డినేటర్ అరుంధతి తెలిపారు. బుధవారం ఆమె భువనగిరికి వచ్చిన సందర్భంగా ఓపెన్ స్కూల్కు సంబంధించిన పోస్టర్ను డీఆర్డీఓ నాగిరెడ్డి, డీఈఓ భిక్షపతి, డీఐఈఓ సురేష్రెడ్డిలతో కలిసి ఆవిష్కరించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమ్యూనిటీ మొబిలైజేషన్ అధికారి పెసరు లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
‘మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టు’కు ఆమోదం హర్షణీయం
సాక్షి యాదాద్రి : ఘట్కేసర్ నుంచి ఖాజీపేట వరకు రైల్వే మార్గాన్ని నాలుగు లైన్లుగా విస్తరించే మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడం పట్ల భువనగిరి మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ బుధవారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. పెరుగుతున్న ప్రయాణికుల రద్దీ, సరుకు రవాణా అవసరాలను దృష్ట్యా ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ ప్రాజెక్టుకు రూ.2,419 కోట్ల నిధులను మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకోవడం శుభపరిణామమని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే ఖాజీపేట వరకు సబర్బన్ రైలు సర్వీసుల విస్తరణకు మార్గం సుగమమవుతుందని తెలిపారు. తాజా నిర్ణయంతో ఘట్కేసర్–ఖాజీపేట మార్గంలో అదనపు లైన్లు ఏర్పాటు కానున్నాయని పేర్కొన్నారు. ఈ మల్టీ ట్రాకింగ్ పనులను 2029 నాటికి పూర్తి చేయాలనే స్పష్టమైన లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని వెల్లడించారు. నిధులు కేటాయించినందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి, కేంద్ర మంత్రివర్గానికి ప్రత్యేక కతజ్ఞతలు తెలియజేశారు.


