చౌటుప్పల్ : హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రి వరకు వాహనాల రద్దీ కొనసాగింది. వీకెండ్తో పాటు గ్రామ్లాల్లో బోనాలు ఉన్న నేపథ్యంలో పట్టణవాసులు పెద్దఎత్తున పల్లెబాట పట్టడంతో హైవేపై వాహనాలు బారులుదీరాయి. ఈ రద్దీ ప్రధానంగా విజయవాడ మార్గంలో బంపర్ టు బంపర్ కొనసాగింది. చౌటుప్పల్ మండల పరిధిలోని ధర్మోజిగూడెం గ్రామ శివారు నుంచి చౌటుప్పల్ పట్టణ శివారులోని ఎలిమినేటి మాధవరెడ్డి బీఈడీ కళాశాల వరకు ఐదు కిలోమీటర్లు ప్రయాణించేందుకు వాహనదారులకు గంట సమయం పట్టింది. దీంతో అటు వాహనదారులు, ప్రయాణికులతో పాటు స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రద్దీ కారణంగా స్థానిక ఆర్టీసీ బస్స్టేషన్ ప్రాంగణం ప్రయాణికులతో కిటకిటలాడింది. సమయానికి అనుగుణంగా, సరిపడా బస్సు సర్వీసులు లేకపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు.
విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై స్తంభించిన ట్రాఫిక్


