యాదగిరిగుట్ట రూరల్: రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు గడిచినా ఉద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని జిల్లా టీజీఈజేఏసీ చైర్మన్ మందడి ఉపేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఈనెల 10న ఎల్బీ నగర్లో నిర్వహించే ఉద్యోగుల హక్కుల సాధన సభకు సంబంధించిన పోస్టర్ను శనివారం యాదగిరిగుట్ట తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆయన ఆవిష్కరించి మాట్లాడారు.ఆరు డీఏలు ఇప్పటివరకు పెండింగ్లో ఉన్నాయని, ఓపీఎస్లను గాలికి వదిలేశారని, పీఆర్సీ, పెండింగ్ బిల్లులు, పెన్షన్ విడుల చేయాలని డిమాండ్ చేశారు. సంక్షేమ పథకాలు అందజేయడంలో ప్రతీ గ్రామంలో ఉద్యోగులు ముందుంటున్నారని, అలాంటి వారి సమస్యలను ప్రభుత్వం మూడు సంవత్సరాలుగా గాలికి వదిలేసిందన్నారు. ఎల్బీనగర్లో జరిగే సభను విజయవంతం చేయాలని కోరారు.ఉద్యోగులు హక్కుల సాధనకు ఏకం కావాల్సిన సమయం వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ గణేష్ నాయక్, డీటీ సత్యనారాయణ, టీఆర్ఈఎస్ఏ జిల్లా సెక్రటరీ శ్రీకాంత్, ట్రెజరర్ కె.శ్రీకాంత్, కో చైర్మన్ శ్రీనివాస్, పాండు, ఆంజనేయులు, మల్లేశం, అనిల్, నర్సింహ, శశికాంత్, గురునాథ్, సునీల్, ఆనంద్, సైదులు పాల్గొన్నారు.
ఫామ్ పాండ్ నిర్మాణంతో భూగర్భ జలాలు పెంపు
వలిగొండ: ఫామ్పాండ్ నిర్మాణంతో భూ గర్భజలాలు పెరుగుతాయని డీఆర్డీఓ టి. నాగిరెడ్డి పేర్కొన్నారు. వలిగొండ మండలంలోని పహిల్వాన్పురం గ్రామంలో ఉపాధిహామీ పథకం కింద చేపట్టిన ఫామ్ పాండ్ పనులను ఆయన పరిశీలించి మాట్లా డారు. నాణ్యతా ప్రమాణాలతో పనులను పూర్తిచేయాలన్నారు. ఆయన వెంట ఏపీఓ పరశురాములు, విక్రమ్, టెక్నికల్ అసిస్టెంట్ శ్రీనివాసు,ి ఫీల్డ్అసిస్టెంట్ విజయ, గ్రామ పంచాయతీ కార్యదర్శి స్నేహలత తదితరులు ఉన్నారు.
వైద్య సేవలు మెరుగుపర్చాలి
కట్టంగూర్ : ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు అందించే సేవలను మెరుగు పరచాలని రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక శాఖ కార్యదర్శి, టీజీఎంఎస్ఐడీసీ (తెలంగాణ వైద్య సేవలు, మౌళివ వసతుల అభివృద్ధి సంస్థ) ఎండీ గౌరవ్ ఉప్పల్ అన్నారు. శనివారం కట్టంగూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని విభాగాలను, రోగులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ప్రభుత్వ వైద్య సేవలు మరింత చేరువయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పీహెచ్సీ వైద్యాధికారి రాపోలు జమున, సిబ్బంది చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు.


