ఆలేరు రూరల్ : ఆలేరు మండలం గొలనుకొండ ప్రాథమిక పాఠశాల ఇంగ్లిష్ టీచర్ జ్యోతిర్మయి పేద, బడుగు బలహీన వర్గాల విద్యార్థుల విద్యా ప్రమాణాలు మెరుగుపరచడమే లక్ష్యంగా వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇంగ్లిష్ అంటే భయపడే విద్యార్థుల కోసం 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఫోనెటిక్స్ ఆధారంగా ఆంగ్ల బోధనకు శ్రీకారం చుట్టారు. ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ ఏఐ ఆధారిత వీడియోలు, డిజిటల్ కంటెంట్ను రూపొందించి పాఠాలను సులభంగా అర్థమయ్యేలా వివరిస్తున్నారు. అంతేకాకుండా ‘చూసి నేర్చుకోవడం– చేసి నేర్చుకోవడం’, సృజనాత్మక వ్యక్తీకరణ విధానాలను అనుసరిస్తూ ఆమె సొంత డబ్బులతో పిల్లలతో కలిసి గోడలపై పెయింటింగ్స్ వేస్తున్నారు.
పెద్దవూర: మండలంలోని ఏనేమీదిగూడెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు వినూత్న రీతిలో బోధన చేస్తూ ప్రత్యేకత చాటుకుంటున్నారు ఉపాధ్యాయుడు తూడి వెంకట్రెడ్డి. ఎక్కువకాలం గుర్తుండేలా సృజనాత్మకమైన బోధన అందించేందుకు కార్యకలాప ఆధారిత అభ్యసన పద్ధతులను అవలంబిస్తున్నారు. ఆటలు, చిత్రలేఖనం, అక్షరాలు–పదాల గుర్తింపు, వస్తువులను ఉపయోగించి విద్య నేర్పుతున్నారు. తరగతి గదిని కేవలం పాఠ్య పుస్తక బోధనకే పరిమితం చేయకుండా, ‘చేస్తూ నేర్చుకోవడం–ఆడుతూ నేర్చుకోవడం’ అనే విధానానికి ప్రాధాన్యత ఇస్తున్నారు.


