సూర్యాపేటటౌన్ : అనారోగ్యానికి గురైన నాలుగు నెలల బాలుడిని ప్రైవేట్ ఆస్పత్రిలో చూయించి, ఇంటికి వెళ్లిన అనంతరం అస్వస్థతకు గురై మృతి చెందాడు. ఈ ఘటన సూర్యాపేటలో శుక్రవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట మండలం యండ్లపల్లి గ్రామానికి చెందిన రాము, ప్రీతి దంపతుల నాలుగు నెలల కుమారుడు జలుబు, జ్వరంతో బాధపడుతుండటంతో శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రైమ్ పిల్లల హాస్పిటల్కు తీసుకువచ్చి చూపించారు. అక్కడ చికిత్స అందించిన అనంతరం బాబును ఇంటికి తీసుకెళ్లారు. కొద్దిసేపటికే బాలుడి పరిస్థితి విషమించి మృతి చెందాడు. దీంతో వైద్యుల నిర్లక్ష్యం వల్లే బాబు మృతి చెందాడని ఆరోపిస్తూ ఆస్పత్రి ఎదుట ఆందోళన చేశారు. తమ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పట్టణ పోలీసులు ఆస్పత్రి వద్దకు చేరుకొని వారి ఆందోళనను విరమింపజేశారు.
ఫ ఆస్పత్రి ఎదుట కుటుంబసభ్యుల ఆందోళన


