ఫ గురువుల ప్రోత్సాహమే నా లక్ష్య సాధన
ఫ సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ
సూర్యాపేటటౌన్ : సాధారణ కుటుంబ నుంచి ఎదిగి ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకున్న ఆయన.. అనంతరం పోలీసు శాఖలో చేరి ప్రస్తుతం సూర్యాపేట జిల్లా ఎస్పీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఎస్పీ నరసింహ నల్లగొండ జిల్లా చండూరు మండలం పుల్లెంల గ్రామంలోని జెడ్పీహెచ్ఎస్లో పదో తరగతి వరకు చదువుకున్నారు. తన ఎదుగుదలలో గురువుల పాత్ర ఎంతో కీలకమని ఆయన చెబుతున్నారు. ముఖ్యంగా 1996 నుంచి 1998 మధ్య తనకు గణితం బోధించిన రాములు సార్ అందించిన ప్రోత్సాహాన్ని ఎప్పటికీ మరిచిపోలేనని నరసింహ పేర్కొన్నారు. పాఠ్యాంశాలను బోధించడంతో పాటు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతూ రాములు సార్ తనను ముందుకు నడిపించారని చెప్పారు. మురళీకృష్ణ సార్ కూడా తనను ఎంతగానో ప్రోత్సహించారని నరసింహ తెలిపారు. ఇంటర్ పూర్తయిన తర్వాత టీటీసీ రాస్తే ఉపాధ్యాయ ఉద్యోగం పొందవచ్చని చెప్పి తనకు దిశానిర్దేశం చేశారని చెప్పారు. గురువుల ప్రోత్సాహంతో తాను కూడా ఉపాధ్యాయుడిగా మారాలనే ఆలోచనకు వచ్చానని పేర్కొన్నారు. మొదట ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగిన తాను కాలక్రమంలో పోటీ పరీక్షల వైపు అడుగులు వేశారు. పట్టుదలతో పోలీసు శాఖలో చేరి నేడు జిల్లా ఎస్పీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నానని, ఇదంతా గురువుల ప్రోత్సాహంతోనే సాధ్యమైందని, గురువుల మాటలను గౌరవించాలని చెబుతున్నారు. ఆ రోజుల్లో గురువులు ఇచ్చిన ప్రోత్సాహం, ధైర్యం నా జీవితంలో ఎంతో ప్రభావం చూపాయి.


